సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది : ఎమ్మెల్సీ అశోక్ బాబు - ASHOKBABU SPEECH ON GOVT EMPLOYEES
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 7:21 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-07-2024/640-480-21950111-thumbnail-16x9-mlc-ashok-babu-fire-on-previous-ysrcp-government.jpg)
MLC Ashok Babu Fire on Previous YSRCP Government : ఏ నమ్మకంతో ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి ఓటేశారో దాన్ని వమ్ముచేయమని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఎవరో చెబితే ఓటు వేయలేదని, స్వతహాగానే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఉన్న కోపంతో ఓటు వేశారని గుర్తు చేశారు. బాత్ రూముల వద్ద ఫొటోలు తీయించడం, మద్యం షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలా ఉంచటం వంటి పనుల వల్ల గత ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ది చెప్పారని చెప్పారు. విజయవాడలో ఏపీఎన్టీవో నేత మహ్మద్ ఇక్బాల్ పదవీ విరమణ సభలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, పురుషోత్తంనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్బాల్ ను పూలమాలలతో ముంచెత్తి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వచ్చే ఆగస్టు, సెప్టెంబరు లోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీఎన్జీవోల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు గత వైఎస్సార్సీపీ హయాంలో కొన్ని నష్టపోయామని, ఈ ప్రభుత్వంలో వాటిని సాధించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సయోధ్య పెరిగిందని తెలిపారు. గెలిచే ప్రభుత్వానికే ఉద్యోగులు ఓట్లు వేశారని శివారెడ్డి గుర్తుచేశారు.