జగన్ అనాలోచిత నిర్ణయాలతో డిస్కంలకు దెబ్బ: మంత్రి గొట్టిపాటి - Minister Gottipati Fire on YSRCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2024, 9:14 AM IST
Minister Gottipati Ravikumar Fire on YSRCP : వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనమైందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని విమర్శించారు. డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. అప్పులు పేరు చెప్పి విద్యుత్ బిల్లులు పెంచి జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంట్ బిల్లులను పెంచింది లేదని గుర్తు చేశారు.
వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్ల కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని గొట్టిపాటి పేర్కొన్నారు. అప్పులు 79 శాతం పెరిగాయని ఆక్షేపించారు. ప్రస్తుతం అప్పు తెస్తే కానీ నడపలేని స్థితిలో డిస్కంలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలు, ఇతర మొత్తాలు కలిపి ఇప్పటికి రూ. 34,954 కోట్ల బకాయిలుగా ఉన్నాయని వివరించారు. ప్రతికూల పరిస్థితులున్నా ప్రజలపై భారాలు వేసే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.