By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
కుంకుమ బొట్టు, పంచకట్టుతో కాణిపాకంలో విదేశీ భక్తుల సందడి - Foreign Devotees Visit Kanipakam
Foreign Devotees Poojalu in Kanipakam Temple : కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని శనివారం నాడు విదేశీ భక్తులు దర్శించుకున్నారు. రష్యా, జర్మనీ, కెనడా దేశాలకు చెందిన 43 మంది సంప్రదాయ వస్త్రాలను ధరించి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలోనే ఆలయంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న వారు వేదమంత్రాలను పఠించారు. వీరందరికీ ఆలయ సూపరింటెండెంట్ వాసు, స్థానాచార్యులు ఫణికుమార్శర్మ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం విదేశీ భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. భారత్కు రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని విదేశీ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు కలిగి ఉన్నాయని చెప్పారు. అందులోనూ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయానికి రావడం ఒక ప్రత్యేకతగా ఉందని పేర్కొన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.పూజలో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. వీరితో ఫొటోలు దిగేందుకు స్థానిక భక్తులు ఆసక్తి చూపారు.