విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి నగరోత్సవం - ప్రత్యక్ష ప్రసారం
Published : 3 hours ago
|Updated : 6 minutes ago
Durga Malleswaraswamy Nagarotsavam Program Started Live : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వారి నగరోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవమూర్తులతో నగరోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ సారి ఈ తంతును చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ప్రతిఏడాది కృష్ణానదిలో నిర్వహించే జలవిహారానికి ఈ ఏడాది అనుమతి నిరాకరించారు.నీటి ఉద్ధృతి కారణంగా దుర్గా ఘాట్ వద్దే ఉత్సవమూర్తులకు హంస వాహనంపై పూజలు నిర్వహిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. చివరి రోజు దసరా నాడు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజు యాగశాలలో చండీహోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. దసరా ఉత్సవాల చివరి రోజు ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవరాత్రుల్లో ఆఖరి రోజు కావడంతో సాధారణ భక్తులతో పాటు అధిక సంఖ్యలో భవాని మాల ధరించిన భక్తులు దర్శనార్థం వచ్చారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి నగరోత్సవం కార్యక్రమం జరుగుతొంది. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : 6 minutes ago