వేటగాళ్ల ఉచ్చుకు బలైన సీఆర్ఫీఎఫ్ ఏఎస్సై - సిబ్బంది అప్రమత్తమైనా దక్కని ప్రాణాలు - CRPF ASI died due to Electric Shock
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
CRPF ASI Died Due to Electric Shock : వేటగాళ్ల అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. వన్య ప్రాణులను వేటాడేందుకు అడవుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు మనుషుల ప్రాణాలు హరిస్తున్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులకు సీఆర్పీఎఫ్ ఏఎస్సై బలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధా-ఒడిశా సరిహద్దుల్లో డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ బీ/42కి చెందిన బృందం విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి వారు మెట్టగూడెం వద్ద అంబుష్కు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి సీఆర్పీఎఫ్ అసిప్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తిరునావుకరసు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సహచర సిబ్బంది ఆయణ్ని డొంకరాయి జెన్కో ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం చింతూరు ఆసుపత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యంలో తిరునావుకరసు మరణించారు. మృతునిది తమిళనాడులోని సేలం జిల్లా వీరకుట్టియపాలెం అని డొంకరాయి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.