25 వేల పోస్టులు ప్రకటించాలి - మంత్రి ఇంటిని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ - protest For Mega DSC
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 5:45 PM IST
Congress Youth Wing Protest for Mega DSC: దగా డీఎస్సీ వద్దూ మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు నెల్లూరు జిల్లాలోని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. పొదలకూరు రోడ్డు నుంచి ప్రదర్శనగా వెళ్లిన విద్యార్థి సంఘాల నేతలు మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. దగా డీఎస్సీ మాకొద్దు, మెగా డీఎస్సీ కావాలంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆరోపించారు. కాకాణి ఇంట్లో లేకపోవడంతో ఆయన నివాసం ముందే ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మాట్లాడారు. సీఎం జగన్ నిరుద్యోగులతో ఆటలాడుతున్నారని విమర్శించారు. గతంలో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. తాజాగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 6 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించారని ఆరోపించారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజన్న పాలనంటూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా మెగా డీఎస్సీ ప్రకటించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని రామారావు హెచ్చరించారు. పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకుల మద్య వాగ్వివాదం, ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి నివాసం వద్ద బైఠాయించిన నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు.