అనంతలో కాంగ్రెస్ న్యాయ సాధన సభ- పేద ప్రజల కోసం కొత్త పథకం ప్రకటన - వైఎస్ షర్మిల సభ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 7:47 PM IST
Congress Public Meeting Arrangements : అనంతపురంలో సోమవారం జరగబోయే కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు న్యాయ సాధన సభగా నామకరణం చేసినట్టు పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) తెలిపారు. అనంతపురంలో ఆయన సభా స్థలాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం జరగనున్న సమావేశంలో దేశ, రాష్ట్ర పేదల అభివృద్ధి కోసం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారని తెలిపారు.
అనంతపురం నుంచి ఎన్నికల ప్రచారం : రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం నుంచి ప్రారంభిస్తున్నట్లు గిడుగు రుద్రరాజు తెలిపారు. 2009 ఎన్నికలకు సంబంధించి 2008లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సాగిన ఎన్నికల ప్రచారాన్ని సెంటిమెంట్గా తీసుకొని అనంతపురం నుంచి ప్రచారం మొదలు పెడుతున్నట్టు చెప్పారు. అనంతపురంలో జరిగే ఈ న్యాయ సాధన సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు. పేద, బడుగు, బలహీన ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన ఏకైక పార్టీగా కాంగ్రెస్ గెలుస్తుందన్న అంశాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.