ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు - సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
CM Chandrababu Comments on Population Growth: రాజధాని నిర్మాణ పనుల ప్రారంభం కార్యక్రమంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధ జనాభా పెరిగి, యువత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ హితం, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదలకు ఆడపడుచులు కృషి చేయాలని సీఎం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అర్హతలపైన సీఎం సరదా వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు అయ్యే విధంగా కొత్త చట్టం తీసుకువస్తున్నామంటూ కార్యక్రమంలో నవ్వులు పూయించారు.
నాడు ఇంటికొక ఐటీ నిపుణుడు ఉండాలన్నా నేడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలంటున్నానని అన్నారు. రాష్ట్ర కష్టాలు చూసి వరుణ దేవుడు కూడా కరుణించటంతో జలాశయాలన్నీ నిండాయని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. విజన్ 2020 అన్న తనను 420 అన్నవాళ్లంతా 420లుగానే మిగిలిపోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న భూతం శాశ్వతంగా భూస్థాపితం చేయాలి, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.