Published : Aug 10, 2024, 11:30 AM IST
తెలంగాణకు కొత్త విమానాశ్రయాలు : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు - Ram Mohan Naidu at Shamshabad
Ram Mohan Naidu Aviation Cultural Week : అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల్లో భద్రత నిర్వహిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులు సైతం విమానాశ్రయాల్లో తనిఖీలు, భద్రత పట్ల అవగాహన కలిగి ఉండి భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. భద్రతా సిబ్బంది సైతం విమాన ప్రయాణికులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. శనివారం ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ నాయుడు మొక్కను నాటారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలన్న మోదీ పిలుపులో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని, అప్పట్లో ఇంత భూమి ఎందుకు కేటాయిస్తున్నారన్న విమర్శలను సైతం బాబు లెక్క చేయలేదన్నారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే నేడు జాతీయ స్థాయిలో శంషాబాద్ విమానాశ్రయం నాలుగో స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని, తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.