ఏసీబీ కార్యాలయంలో ఐదుగురిపై వేటు
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 10:34 AM IST
|Updated : Feb 26, 2024, 11:53 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-02-2024/640-480-20841638-thumbnail-16x9-5-officers-suspended-in-acb.jpg)
5 Officers Suspended In ACB: విజయవాడ ఏసీబీ రేంజి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు వేటు వేశారు. అవినీతి (Corruption) అధికారులతో కుమ్మక్కు కావడం, కీలక సమాచారాన్ని లీక్ చేయడం, వారి నుంచి ఆర్థికంగా లబ్ధి పొందడం, ఇలా పలు ఆరోపణలు (allegations) రావడంతో వీరిని అనిశా నుంచి తప్పించి, మాతృ యూనిట్లకు సరెండర్ చేశారు. ఈ ఉదంతంపై అనిశా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
అనిశా నుంచి తప్పించిన డీఎస్పీలు శరత్, శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు కృపానందం, శివకుమార్, కానిస్టేబుల్ సురేష్లు దాదాపు నాలుగేళ్లుగా ఏసీబీ (ACB)లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిర్యాదులపై పట్టించుకోకుండా అవతలి వ్యక్తులతో కుమ్మక్కు అయినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై అధికారులు రహస్య విచారణ నిర్వహించగా ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. నిష్పక్షపాత విచారణ కోసం అయిదుగురినీ అనిశా నుంచి వెనక్కు పంపించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ బాలనాగ ధర్మసింగ్ అవినీతిని తొలుత ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవటంతో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా అనిశా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విభాగాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది. గత ఏడాది నవంబరులో సీఐయూ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ఆస్తులపై వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. సబ్రిజిస్ట్రార్కు ఈ సమాచారం ముందుగా అందడంతో పరారయ్యారు. మూడు నెలలుగా ఆయన ఆచూకీ దొరకలేదు. సరెండర్ అయిన వారి నుంచి సబ్ రిజిస్ట్రార్ కు సమాచారం వెళ్లినట్లుగా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.