GBS First Death in Telangana : ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జీబీఎస్ (గులియన్ బారీ సిండ్రోమ్). ఇది ఒక నరాల వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. ఈ వ్యాధితో తెలంగాణలో తొలి మరణం సంభవించింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సిద్దిపేటకు చెందిన ఓ వివాహిత మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,
సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లికి చెందిన వివాహిత (25)కు ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఇటీవల కుమార్తె జన్మించింది. కుమార్తె జన్మించిన తర్వాత నెల రోజుల కిందట నరాల నొప్పులతో మహిళ అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట, హైదరాబాద్లోని నిమ్స్, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఇలా ఆమె వైద్యానికి రూ.లక్షలు వెచ్చించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పుణెలో జీబీఎస్ కారణంగా పలువురు మృతి చెందారు. ఇప్పటికే చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణం సంభవించడం ఇదే మొదటిదని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్లో జీబీఎస్ వ్యాధి తొలి కేసు నమోదు - అసలేంటీ వ్యాధి, ఎలా వస్తుందంటే?