Road Accident at Kotur Today : నేటికాలంలో వాహనంపై బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వస్తామన్న నమ్మకం లేకుండా పోయింది. ఇక ద్విచక్ర వాహనంపై వెళ్తున్నామంటే చాలు, అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డుపై మనం సరిగ్గానే వెళ్తున్నా మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అశ్రద్ధ వల్ల ఓ ఇల్లాలు, పండంటి పసిపాప ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం రోజున సరదాగా గడపడానికి బంధువుల ఇంటికి వెళ్తున్న ఆ కుటుంబానికి తీరని శోకం ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో డ్రైవర్ : బెంగళూరు జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ స్టీరింగ్పై పట్టు కోల్పోవడంతో ఎదురుగా వెళ్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లితో సహా ఏడాది వయసున్న చిన్నారి దుర్మరణం చెందారు. ఈ సంఘటన కొత్తూరు మండలం చేగూరు చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. కొత్తూరు సీఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక రాష్ట్రం హుగ్లీ నుంచి ఓ లారీ గూడ్స్తో హైదరాబాద్కు వస్తోంది. సంబంధిత లారీ డ్రైవర్ షేక్ మహమ్మద్ మద్యం సేవించాడు.
భర్తకు తప్పిన ప్రమాదం : మద్యం మత్తులో తూగుతున్న డ్రైవర్, లారీపై అదుపు కోల్పోయాడు. దీంతో ఎదురుగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, టెంపో ట్రావెల్ వాహనాలను ఢీకొట్టాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న షాద్నగర్ పట్టణానికి చెందిన సాయికృష్ణ భార్య కావ్య (24), ఏడాది వయసున్న చిన్నారి అనన్య మృతి చెందారు. సాయి కృష్ణతో పాటు అతని పెద్ద కుమార్తె మరోవైపు పడిపోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్పంగా గాయాలు కాగా, టెంపో ట్రావెల్లో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టూరిస్ట్ల బస్సుకు ప్రమాదం- 11మంది దుర్మరణం- మరోఘటనలో 26మంది బలి!
నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా - 30 మందికి స్వల్పగాయాలు