MEIL MOU With Telangana Govt : ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందంతో ప్రముఖ సంస్థలు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. 15 వేల కోట్ల రూపాయలతో మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.500కోట్లతో రాష్ట్రంలో ప్రైవేట్ రాకెట్తయారీ,ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు ‘స్కైరూట్’ ముందుకొచ్చింది. తెలంగాణలో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ‘యునిలీవర్ కంపెనీ సంసిద్ధత వ్యక్తంచేసింది.
రాష్ట్రానికి పోటెత్తిన పెట్టుబడులు : దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో రెండోరోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు పలువురు అధికారులతో కలిసి మేఘా, యునిలీవర్, స్కైరూట్ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆధునిక పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తిప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 7వేల ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంది. పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధికి తెలంగాణ సర్కారు నిబద్ధతను బలపరుస్తూ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఒప్పందంపై సంతకాలుచేశారు. రాష్ట్రంలో 11 వేల కోట్ల రూపాయల ప్రతిపాదిత పెట్టుబడితో ఏర్పాటు 2వేల160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటుచేసేందుకు ఎంఈఐఎల్ ముందుకొచ్చింది.
2 వేల ఉద్యోగాలను సృష్టించే అవకాశం : సమర్థమైన ఇంధననిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్లోడ్ మేనేజ్మెంట్ ప్రారంభించడం ద్వారాతెలంగాణ పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల బలోపేతంలో ఆ ప్రాజెక్టు కీలకం కానుంది. అనంతగిరి కొండల్లో ప్రపంచస్థాయి వెల్నెస్ రిసార్ట్ను నెలకొల్పేందుకు మరో ఒప్పందం కుదిరింది. ఇందుకోసం ఎంఈఐఎల్ వెయ్యి కోట్ల పెట్టుబడిని పెట్టనుంది. లగ్జరీ టూరిజం, ప్రాంతీయ ఆర్థికవృద్ధిని ప్రోత్సహించేందుకు ఆ ప్రాజెక్టు దోహదం చేయనుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం, కార్యకలాపాల దశలో 2 వేల ఉద్యోగాలను సృష్టించే అవకాశముందని అంచనా.
తెలంగాణ రైజింగ్ 2050 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని యూనిలీవర్ సీఈవో హీన్ షూమాకర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో స్థలం కేటాయిస్తామని సీఎం ఇచ్చారు. రాష్ట్రంలో బాటిల్ క్యాప్ల ఉత్పత్తికి కొత్త తయారీ యూనిట్ నెలకొల్పేందుకు యూనిలీవర్ బృందం అంగీకరించింది.
పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు : దావోస్లో తెలంగాణ పెవిలియన్లో జరిగిన మొదటి సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు అజిలిటీ సంస్థ ఛైర్మన్ తారెక్ సుల్తాన్తో భేటీఅయ్యారు. వ్యవసాయరంగఅభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు రైతుల ఆదాయాన్ని ఇస్తున్న ప్రాధాన్యాలను శ్రీధర్బాబు ఆ సంస్థ ఛైర్మన్తో పంచుకున్నారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమలకు పెట్టుబడి అవకాశాలపై సాంబనోవా కంపెనీ చీఫ్ గ్రోత్ఆఫీసర్ ‘సూలేతోనూ' చర్చలు జరిపారు.
కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఏఐ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించటంలో పేరొందింది. సౌదీఅరేబియా ఫెడరల్ మినిస్టర్ ఖలీద్ మహమ్మద్ అల్ సలీమ్తో సమావేశమైన శ్రీధర్బాబు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు.
అంతరిక్ష సాంకేతిక రంగానికి చెందిన హైదరాబాద్ సంస్థ ‘స్కైరూట్ ఏరో స్పేస్తోనూ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తారు. ఆ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ రాష్ట్రంలో దాదాపు 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు - రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 'కంట్రోల్ ఎస్'
తెలంగాణలో యూనిలివర్ పెట్టుబడులు - సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో పలు ఒప్పందాలు