Hyderabad 2050 Master Plan : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దశ దిశ మార్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోందని, రానున్న పాతిక సంవత్సరాల అవసరాలకు తగ్గట్టుగా 2050 - మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం (CMO) వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మహా నగరాన్ని ఫ్యూచర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి తీసుకున్న చర్యలపై సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.
నగరంలో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు రూ.2,232 కోట్లతో రాజీవ్ రహదారి (Rajiv Road)పై ఎలివేటెడ్ కారిడార్, రూ.1,580 కోట్లతో నాగ్పుర్ జాతీయ రహదారిపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారని సీఎంవో గుర్తు చేసింది. ముఖ్యంగా మెహిదీపట్నం వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి తెప్పించడం పెద్ద విజయమని పేర్కొంది.
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ : రూ.24,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, హైదరాబాద్ నగరం చుట్టూ రూ.18 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ నిర్మించనున్నారని తెలంగాణ సీఎంవో తెలిపింది. హెచ్సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ.8,996 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి రూ.596 కోట్ల అంచనాలతో వరద నీటి కాల్వలను, కూడళ్లలో వర్షఫు నీరు నిలవకుండా భూగర్భ బావులను నిర్మిస్తున్నారని, కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారని పేర్కొంది.
హైదరాబాద్లో మెట్రో విస్తరణ - నాలుగేళ్లలో పనులు పూర్తి: ఎన్వీఎస్రెడ్డి
రూ.360 కోట్లతో మీరాలం చెరువు వద్ద 4 లేన్ల వంతెన నిర్మిస్తున్నారని, 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించనున్నారని, ఫార్మాసిటీతో పాటు ఏఐ నగరం, సాఫ్ట్వేర్, లైఫ్సైన్సెస్, హెల్త్కేర్ టెక్నాలజీ వంటి పరిశ్రమల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దబోతున్నారని ప్రకటించింది. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి ఇప్పటికే శంకుస్థాపన చేశారని, త్వరలోనే క్రీడా విశ్వవిద్యాలయం నెలకొల్పబోతున్నారని వివరించింది.
గాంధీ ఐడియాలజీ కేంద్రం ఏర్పాటు : హైదరాబాద్లో చెరువులు, నాళాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశారని, మూసీ పునరుజ్జీవంతో పాటు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారంది. మూసీలోకి చేరుతున్న మురుగును శుభ్రం చేసేందుకు కొత్తగా 39 ఎస్టీపీలను ఏర్పాటు చేయబోతున్నారని, ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి, హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చనున్నారని, బాపూఘాట్ను తీర్చిదిద్ది, గాంధీ ఐడియాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారని సీఎం కార్యాలయం వివరించింది.
ఏపీలోనూ "హైటెక్ సిటీ" నిర్మాణం - 2029 నాటికి 5లక్షల వర్క్స్టేషన్లు : చంద్రబాబు