TDP Neelayapalem Vijay Kumar Fires on YSRCP: జగనేమో రాష్ట్రంలో విద్యావిధానం గొప్పగా ఉందంటున్నారని కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు వెళ్లిపోతున్నారని టీడీపీ నేత ఎన్.విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఏకంగా 4.5 లక్షల మంది విద్యార్థులు తగ్గారని విజయ్ కుమార్ అన్నారు. బైజూస్ కంటెంట్, ఐబీ విద్యా విధానం కాదని ముందు విద్యార్థుల శాతం పెంచండని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థులు తగ్గిపోతూ వస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు.
2021-22లో 43 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్న విజయ్ కుమార్, ప్రభుత్వ బడుల్లో ఇప్పుడున్నది 37 లక్షల 80 వేల మంది విద్యార్థులు మాత్రమే అని అన్నారు. గత రెండేళ్లలో పెద్దఎత్తున ప్రభుత్వ బడుల్లో తగ్గిపోయారని, తగ్గిన విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు లేదా పూర్తిగా విద్యకే దూరం అయ్యి ఉండాలని విజయ్ విమర్శించారు. నాడు-నేడు అంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి తగ్గించడమేనా అంటూ మండిపడ్డారు.
ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా జగన్? రాష్ట్రంలో మూత'బడు'లు - చదువులకు దూరం అవుతున్న పిల్లలు
మొదట్లో కార్పొరేట్ స్కూళ్లకంటే అందంగా తీర్చిదిద్దుతామన్నారు అని అన్నారని తీరా ఇప్పుడు విద్యార్థులు ఇలా వెళ్లిపోవడమేంటో సీఎం జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలని ధ్వజమెత్తారు. కనీసం ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేపట్టలేదేంటి జగన్ గారూ అంటూ ప్రశ్నించారు. 3, 4, 5వ తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేశారన్న విజయ్, విలీనం వల్ల 1, 2 తరగతుల్లో విద్యార్థులు తగ్గి స్కూళ్లు మూతబడ్డాయని ఆరోపించారు.
విద్యార్థులు లేరంటూ వందల పాఠశాలలను మూసేశారని, జీవో 117తో టీచర్లను తగ్గించి పిల్లలను బడికి దూరం చేశారని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న విజయ్, మానవ వనరులపై వ్యయం తగ్గించుకుంటామన్న నిబంధనతో రుణం తీసుకున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలేంటో, ఒప్పందాలేంటో జగనే చెప్పాలని నిలదీశారు.
76 ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమైన జగన్ సర్కార్
ఒప్పందం ఏంటోగానీ గత మూడేళ్లలో 4 వేల 700 పాఠశాలలు మూసేశారన్న విజయ్, 2019-20లో రాష్ట్రంలో మొత్తం 63 వేల 463 పాఠశాలలు ఉన్నాయని అవి 2023-24కు వచ్చే సరికి 58 వేల 754 చేరాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ సంస్కరణలు పాఠశాలల మూతకు దారితీశాయని విజయ్ కుమార్ ఆరోపించారు. పేదలకు ఇంటి వద్ద బడి లేకుండా చేసిందీ వైసీపీ ప్రభుత్వమే అని విజయ్ కుమార్ మండిపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలల విలీనం తర్వాత ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి వచ్చిందని, హేతుబద్ధీకరణ అంటూ టీచర్లను తగ్గించి స్కూళ్లను విలీనం చేసి చివరకు ముసేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వానికి డీఎస్సీ నోటిఫికేషన్ గుర్తొచ్చిందా అంటూ నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు.
ప్రభుత్వ బడుల్లో అదృశ్య విద్యార్థులు - గొప్పల కోసం సర్కార్ తప్పుడు లెక్కలు