TDP Central Office Attack Case Handed Over TO CID : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ఫైళ్లను సోమవారం (అక్టోబర్ 14న) సీఐడీకి మంగళగిరి డీఎస్పీ అందజేయనున్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారు. చంద్రబాబు నివాసంపై మాజీ మంత్రి జోగి రమేశ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్ తదితరులు తమ అనుచరులతో దాడికి వెళ్లినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయి. నిందితుల్లో నందిగం సురేశ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతానికి కేసులను సీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - కీలక నిందితులుగా వైఎస్సార్సీపీ నేతలు - TDP Office Attack Case