Sonia Gandhi May Not Come to Telangana Formation Day : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో అవతరణ వేడుకలకు రాలేకపోతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంత్రావు వెల్లడించారు. ఆదివారం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం : మే 28 దిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. అందుకు ఆమె సూత్రపాయంగా అంగీకరించారని స్వయంగా సీఎంనే తెలిపారు. అయితే ఆ తర్వాత కూడా ఏఐసీసీ నుంచి సోనియాగాంధీ ఆవిర్భావ వేడుకలకు హాజరవుతారని పీసీసీ వర్గాలు తెలిపాయి. అయితే ఇంతలోనే మళ్లీ సోనియాగాంధీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావడం లేదంటూ కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం. పార్టీ సీనియర్ నేత వీహెచ్ కూడా ఇదే విషయం తెలిపారు. అనారోగ్య కారణాలతోనే రావడం లేదని పేర్కొన్నారు. దీనిపై దిల్లీలో ఏఐసీసీ వర్గాలు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. పదేళ్ల రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విద్యావేత్తలను, ఉద్యమకారులను, రాజకీయ నేతలు అందరినీ ఆహ్వానించారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు : ఇప్పటికే జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. భాగ్యనగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతుంది. చార్మినార్, ట్యాంక్బండ్, సచివాలయం, అమరజ్యోతి స్థూపం, బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, గోల్కొండ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో విద్యుత్ దీపాల కాంతులను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. నగరం సీసీ కెమెరాల నిఘాలోకి వెళ్లిపోయింది. సీఎస్ శాంతికుమారి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ట్రాఫిక్ విషయంలో హైదరాబాద్ నగర పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని విజ్ఞప్తి చేశారు.
తుది దశకు చేరుకున్న జయ జయహే తెలంగాణ గీతం, చిహ్నం - CM Revanth to Review Telangana Song