Six Fishermen Missing at Sea in Vishaka : సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. విశాఖ జిల్లా శివారు అప్పికొండ ప్రాంతంలో వారు ఉన్నట్లు బుధవారం తెల్లవారుజామున అధికారులు గుర్తించారు. అనంతరం ఆరుగురు మత్స్యకారులను అధికారులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అలల ఉద్ధృతి కారణంగా వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడి దెబ్బంది. దీంతో దాని పైభాగంలో ఉంటూ బిక్కుబిక్కుమంటూ మంగళవారం రాత్రి వరకు గడిపారు. చివరికి మత్స్యకారులంతా క్షేమంగా ఉండటంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.
మరోవైపు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్పై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లంతైనట్లు సమాచారం ఇచ్చినా సకాలంలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఫిషింగ్ హార్బర్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేపై మండిపడ్డారు.
అసలు ఏం జరిగిందంటే?: సోమవారం సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి చేపల వేటకు ఆరుగురు మత్య్సకారులు వెళ్లారు. వేటకు వెళ్లిన వీరు సముద్రంలో గల్లంతయ్యారు. రాత్రి గడిచినా వారు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మంగళవారం కోస్ట్గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు, కోస్ట్గార్డులు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అధికారులు ఈరోజు ఆరుగురు మత్య్సకారుల ఆచూకీని కనుగొన్నారు. దీంతో బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ మత్య్సకారులంతా నివాసం ఉండేది హార్బర్ వద్ద జాలరిపేటలోనే. కానీ వీరి స్వస్థలం మాత్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామం.
గల్లంతైన వారి పేర్లు :
1. కారి చిన్నారావు
2. వాసుపల్లి అప్పన్న
3. కారి చిన్న సత్తయ్య
4. కారి నరేంద్ర
5. వాసుపల్లి పొడుగు అప్పన్న
6. మైలపల్లి మహేష్