Shortage Of Medicines In PHC In Telangana : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పలు ముఖ్యమైన ఔషధాలకు కొరత ఏర్పడింది. నిత్య జీవితంలో వినియోగించే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్, నొప్పులు తగ్గడానికి టాబ్లెట్స్, కళ్ల ఇన్ఫెక్షన్ను తగ్గించే చుక్కల మందు, కాలిన గాయాలపై పూసే క్రీము, ప్రమాదాల్లో గాయాలైనప్పుడు కుట్లు వేసేందుకు ఉపయోగించే దారం, గాయాలకు కట్టుకట్టే ప్లాస్టర్లకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
హిందీలో మందుల చీటీ.. 'శ్రీ హరి' పేరుతో ప్రిస్క్రిప్షన్.. డాక్టర్ వినూత్న నిర్ణయం
Shortage Of Medicine In Primary Health Centers : గత 10 నెలలుగా ఔషధ సరఫరాదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.125 కోట్లకుపైగా బకాయిలు చెల్లింపునకు నోచుకోకపోవడంతో వారు గత 4 నెలలుగా సరఫరాను పూర్తిగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అత్యవసర ఔషధాలు అరకొరగా లభ్యమవుతుండటం పీహెచ్సీ(PHC)లపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. దొరకని పరిస్థితుల్లో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. రానున్నది వర్షాకాలం, ఎండాకాలంలో సాధారణంగా కలుషిత నీరు, ఆహారం కారణంగా వ్యాధులు ప్రబలుతాయి. వాంతులు, విరేచనాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, జ్వరాల బాధితులు పెరుగుతారు.
మేలుకోకపోతే ఇబ్బందే : వానాకాలం మొదలైతే దోమల ద్వారా వ్యాప్తి చెందే జ్వరాలు మొదలవుతాయి. ఈ సమయంలో ఓపీ, ఐపీలకు వచ్చే రోగులు దాదాపు మూడింతలు ఆసుపత్రికి తాకిడి పెరుగుతుంది. సాధారణంగా ఆర్నెల్లకు సరిపడా మందులను వైద్య శాఖ ముందస్తుగానే సమకూర్చుకుంటుంది. లేనిపక్షంలో వ్యాధులు విజృంభిస్తున్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన ఔషధాలను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం కష్టమవుతుంది.
Harish inspection at Hospital: సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వండి: హరీశ్ రావు
Primary Health Care :టెండర్లు పిలవడం, సరఫరాదారులను ఎంపిక చేయడం, వాటికి ఆర్డర్లు ఇవ్వడం, అవి సరఫరా చేయడం, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూణ్నెల్లు పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సత్వరమే దృష్టిపెడితే తప్ప రాబోయే కాలంలో సమస్య అధిగమించే అవకాశం ఉండదని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
సమస్య ఎక్కడ మొదలైంది? ఈ ఆర్థిక సంవత్సర (2022-23) వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం ఆరోగ్య శాఖకు(Health Department) రూ.12,161 కోట్లు కేటాయించింది. అందులో ఔషధాలకు రూ.377 కోట్లు, పీహెచ్సీలలో నిర్ధారణ పరీక్షలు, శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాలకు కలిపి రూ.75 కోట్లు కేటాయింపులు చేసింది. అయితే ఔషధాలు, నిర్ధారణ పరీక్షలు, శస్త్రచికిత్సల పరికరాల కోసం కేటాయించిన రూ.452 కోట్లలో ఇప్పటివరకూ ప్రభుత్వం విడుదల చేసింది కేవలం రూ.175 కోట్లు మాత్రమే. దీంట్లో రూ.125 కోట్లు 2021-22కు సంబంధించిన బకాయిలే ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఔషధాలు, సర్జికల్స్ కోసం విడుదల చేసిన నిధులు కేవలం రూ.50 కోట్లు మాత్రమే.
పీహెచ్సీల్లో ఔషదాల కొరత : ఇక ఈ సంవత్సరం చెల్లింపులకు సంబంధించి రూ.125 కోట్ల చెక్కులు జారీ చేసినప్పటికీ, వేర్వేరు కారణాల వల్ల ఆర్థికశాఖ నుంచి విడుదలకు నోచుకోలేదు. మరో రూ.125 కోట్ల ఔషధాల చెల్లింపుల బిల్లులు టీఎస్ఎంఎస్ఐడీసీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. గతేడాది బకాయిలు ఈ ఏడాదికి, ఈ ఏడాదివి వచ్చే ఏడాదికి, ఆ బకాయిలు మరుసటి ఏడాదికి ఇలా ఏటేటా బకాయిలు పెరిగిపోతుండడంతో ఆ ప్రభావం సరఫరాపై పడుతోంది. దీంతో ఔషధ సరఫరా చేసే వారు ఇక తమ వల్ల కాదంటూ నాలుగు నెలల కిందటే చేతులెత్తేశారు. ఫలితంగా ఔషధ నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి.
కొరత ఉన్న మరికొన్ని ఔషధాలు
- ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఎక్కువగా వినియోగించే యాంటీ బయాటిక్స్ 'అజిథ్రోమైసిన్ 250 ఎంజీ', ‘అమోక్సీ క్లావ్ సస్పెన్షన్’ సిరప్
- యాంటీ ఫంగల్ ఔషధం మికోనజోల్ క్రీమ్
- కంటి ఇన్ఫెక్షన్లకు వినియోగించే ‘సిప్రొఫ్లాక్ససిన్’ చుక్కల మందు
- కాలిన గాయాలను తగ్గించడానికి ఉపయోగించే ‘సిల్వర్ సల్ఫడియాజిన్ క్రీమ్’
- గాయాలను కుట్టడానికి, ఆపరేషన్ థియేటర్లలో వాడే ‘బి.బి. సిల్క్’
- గాయాలపై కట్టు కట్టడానికి వాడే ‘పేపర్ ప్లాస్టర్లు ఇలా కొన్ని రకాల ఔషధాలు, సర్జికల్ వస్తువులు పీహెచ్సీలలో తగినంతగా సరిపడటం లేదు.
Rajapur PHC doctor suspended: వ్యాక్సినేషన్పై నిర్లక్ష్యం.. పీహెచ్సీ డాక్టర్ సస్పెండ్