Revenue Complaints Pending in AP : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగం నాన్చుడు ధోరణిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా జిల్లాల్లో పరిష్కార చర్యలు తీసుకోవడంలో వేగం కొరవడుతోంది. వివిధ మార్గాల్లో గతేడాది జూన్ 15 నుంచి ఇటీవల వరకు రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రభుత్వానికి సుమారు 3.53 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు 1.71 లక్షల అర్జీలను మాత్రమే పరిష్కరించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. పరిష్కారమైనట్లు చెబుతున్న వాటిలోనూ కొన్ని దరఖాస్తులపై తీసుకున్న చర్యలు కాగితాలపైనే ఉన్నాయని సమచారం.
వినతులు పరిష్కార చర్యలపై రెవెన్యూ శాఖ ప్రతి వారం సమీక్షిస్తూనే ఉంది. బాధితుల వినతులు తహసీల్దార్ల నుంచి వీఆర్వోల వద్దకు వెళ్తున్నాయి. వీఆర్వోల్లో కొందరు వీటిపై శ్రద్ధపెట్టకుండానే పరిష్కరించినట్లు చూపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది కొరతతోపాటు, ఇతర విధుల భారం ఉన్నతాధికారులను ఇబ్బందిపెడుతోంది. రీ-సర్వే జరిగే గ్రామాలకు కొన్ని మండలాల నుంచి సిబ్బందిని డిప్యూటేషనపై పంపారు.
Revenue Complaints Issue in AP : కొందరు అన్నదాతలు తమ భూమికి 1బి అడంగల్ ఆన్లైన్లో కనిపించడం లేదని, చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ విజ్ఞప్తులు ఇచ్చినా పరిష్కారం దొరకడం లేదని చెబుతున్నారు. భూమిని ఆక్రమించారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదుచేసినా న్యాయం జరగలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్, 1బిలో తప్పులు ఉండటంతో మరికొందరు రైతులకు ప్రభుత్వ నుంచి అందాల్సిన ఆర్థిక లబ్ధితోపాటు పంట రుణాలను పొందలేకపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అందిన 3.53 లక్షల ఫిర్యాదులు లేదా వినతుల్లో 1.85 లక్షలు రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చాయి. 28 క్యాటగిరీలకు చెందిన వీటిలో ఇప్పటివరకు 78,767 మాత్రమే పరిష్కారమయ్యాయి. మరో 1.6 లక్షలు పరిశీలనలో ఉన్నాయి. భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు 83 శాతం, ప్రభుత్వ భూఆక్రమణలపై 80 శాతం, భూ కేటాయింపులకు సంబంధించి 73 శాతం వరకు ఉన్నాయి. కొన్ని ఫిర్యాదులు రీ-సర్వేకు చెందినవి.
ఫిర్యాదుల పరిష్కారంలో పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం, పలాస రెవెన్యూ డివిజన్లు బాగా వెనుకబడ్డాయి. ఫిర్యాదుల పరిష్కారంలో విజయవాడ , తిరువూరు , చీరాల డివిజన్లు ముందు వరసలో ఉన్నాయి. వార్డు, రెవెన్యూ కార్యదర్శుల పనితీరుపై 7,677 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధిక ఫిర్యాదులు ఎన్టీఆర్ జిల్లాలో నమోదయ్యాయి.
'రెవెన్యూ సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి - డిసెంబర్ 12న విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ'
'భూ కబ్జాలపై భారీగా ఫిర్యాదులు - కొత్త చట్టంతో నిందితులకు 14ఏళ్ల జైలు'