Stalled Property Registrations Across the Telangana State : తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా ఆగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్లకు చెందిన ఆధార్ లింక్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్లు వివరించారు. సాంకేతిక సమస్య కారణంగా ఈ మధ్యాహ్నం నుంచి ఆగినట్లు వెల్లడించారు. యూడీఐఏలో ఈ- కేవైసీలో వెరిఫికేషన్కు సంబంధించి సాంకేతిక సమస్యగా చెబుతున్న అధికారులు, దానిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు అనుకోకుండా ఎదురైన సాంకేతిక సమస్యతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమస్య పరిష్కారమైతే వెంటనే వేచి ఉన్న వారి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని, రద్దీగా ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రేపు రావాల్సిందిగా ఇప్పటికే తెలియజేసినట్లు తెలిపారు.
రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడంపై స్పందించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్, దిల్లీలో కురుస్తున్న వర్షాల కారణంగా యూఐడీఏఐ నెట్ వర్కింగ్లో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఈ సమస్య ఉత్పన్నమైనట్లు వివరించారు. ప్రతి రోజు దాదాపు 7 వేల రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఆధార్ సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఆశించిన మేర జరగలేదని తెలిపారు. ఈ రాత్రికి సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నామన్న ఆయన, పెండింగ్ రిజిస్ట్రేషన్లను రేపటికి రీషెడ్యూల్ చేసినట్లు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఆధార్ నెట్వర్క్ (UIDAI)లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా రాష్ట్రంలో మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లకు ఆధార్ బయో మెట్రిక్ తప్పనిసరి కావడంతో సేవలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ రాత్రికి సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. పెండింగ్ రిజిస్ట్రేషన్లను రేపటికి రీ-షెడ్యూల్ చేశాం. - జ్యోతి బుద్ధప్రకాశ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ