Police Solved Railway Loco Pilot Murder Case: విజయవాడ రైల్వే స్టేషన్లో లోకోపైలట్గా విధులు నిర్వహిస్తున్న ఎబినేజర్(52) హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బిహార్కు చెందిన దేవ్కుమార్గా గుర్తించారు. నగదు కోసమే నిందితుడు ఇనుపరాడ్తో కొట్టి లోకోపైలట్ను హతమార్చినట్లు చెప్పారు.
విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఎఫ్ క్యాబిన్ మధ్య అక్టోబర్ 9న అర్ధరాత్రి 2 గంటల సమయంలో విధి నిర్వహణలో ఉండగా గుర్తు తెలియని ఆగంతకుడు ఇనుప రాడ్డుతో ఆయన తలపై బలంగా కొట్టారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే రైలు పట్టాలపై పడిపోయారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అరెస్టు చేశారు.
ముందుగా రంగంలోకి దిగిన పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో అప్పి యార్డ్ సమీపంలో పోలీసులకి నిందితుడు చిక్కాడు. రైల్వే డీఎస్పీ రత్నరాజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు దేవ్కుమార్ అనే వ్యక్తి బీహార్కి చెందిన వాడిగా గుర్తించినట్లు తెలిపారు. అతను పనుల నిమిత్తం విజయవాడ వచ్చి ఉంటున్నట్లు వివరించారు. ఈ క్రమంలో విజయవాడకు వచ్చిన అతను చెడు అలావట్లకు బానిసై వచ్చే డబ్బు సరిపోక రాత్రి వేళల్లో ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి వారి నుంచి డబ్బులు లాక్కొని పారిపోతాడని రైల్వో డీఎస్పీ వివరించారు.
అదే క్రమంలో 10వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ వద్ద లోకో పైలెట్ కనిపించగా అతనిని దగ్గర డబ్బులో దోచుకునే నెపంతో ఆ లోకో పైలెట్ను నిందితుడు ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టాడని డీఎస్పీ తెలిపారు. దీంతో లోకో పైలెట్ కింద పడిపోగా అతని దగ్గర ఉన్న డబ్బులను దోచుకుని నిందుతుడు పారిపోయినట్లు వివరించారు. ఆ నిందుతుడు అక్కడి నుంచి పారిపోయే క్రమంలో దారిలో మరొక వ్యక్తిపై దాడి చేసి అతని దగ్గర నుంచి కూడా డబ్బులు దోచుకున్నట్లు రైల్వే డీఎస్పీ రత్నరాజు తెలిపారు.