BRS Leader Krishank is Being Interrogate by OU Police : సామాజిక మాధ్యమాల్లో ఓయూ అధికారుల పేరుతో ఫేక్ సర్క్యులర్ లెటర్ను వైరల్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి క్రిశాంక్ను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓయూ అధికారిక లెటర్ను మార్ఫింగ్ కేసులో అరెస్టు అయి జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న క్రిశాంక్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన 24 గంటల కస్టడీలో భాగంగా అతనిని పోలీసులు పలు కోణాల్లో విచారించారు. డాక్యుమెంట్ మీ వద్దకు ఎలా వచ్చిందని క్రిశాంక్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. లేకపోతే మీరే మార్ఫింగ్ చేశారా లేదా మీకు ఎవరైనా మార్ఫింగ్ చేసి దానిని మీకు పంపించారా?. ఈ డాక్యుమెంట్ ఎలా ఎక్కడెక్కడ సర్క్యులేట్ చేశారని పోలీసులు ప్రశ్నించారు.
క్రిశాంక్ వెంట అతని అడ్వకేట్ లక్ష్మణ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అడ్వకేట్ మాట్లాడుతూ పోలీసులకు విచారణ సమయంలో పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ఘటనలపై వచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగానే విచారణ కొనసాగాలని అడ్వకేట్ కోరారు. అంతకు ముందు చంచల్గూడ జైలు నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి క్రిశాంక్ను ఓయూ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్కి తరలించారు.
అసలేం జరిగింది : ప్రతి ఏటా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు మెస్లు మూసివేతపై సర్కులర్ జారీ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా అధికారులు సర్కులర్ జారీ చేయగా వాటిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్లు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి క్రిశాంక్, నాగేందర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళుతుండగా పంతంగి టోల్ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. దీనిపై సీఎం తీవ్రంగానే స్పందించి, విచారణకు ఆదేశించారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఓయూపై దుష్ప్రచారం కేసు - పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత - BRS Leader Arrest in OU issue
విద్యార్థినుల బాత్రూంలోకి చొరబడిన దుండగులు - రక్షణ కల్పించాలంటూ అమ్మాయిల ధర్నా