Mrs Asia International-2024 Runner Up Ratna Mehta From Rajahmundry : మహిళలు అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొని సాధికారతను చాటుతున్నారు ఈ రోజుల్లో. ఏదైనా సాధించాలనే సంకల్పం ఉంటే మహిళలు ఎంతటి ఘన విజయాన్నైనా అందుకోగలరని మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్-2024 రన్నరప్ రత్నా మెహెతా అంటున్నారు. రాజమహేంద్రవరం ఇంటి కోడలైన ఈమె మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ రన్నరప్గా నిలిచారు. నగరానికి చెందిన మెడికల్ వ్యాపారి బలబద్ర కృష్ణమూర్తి కోడలు రత్నా మెహెతా నవంబరు 13 నుంచి 19వరకు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్-2024 పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని స్వీయ పరిచయం, ప్రతిభ ప్రదర్శన, ప్రశ్నోత్తరాల విభాగం, ర్యాంప్ వాక్ తదితర అంశాల్లో ప్రతిభతో గెలుపొంది రన్నరప్గా నిలిచారు.
ఈ సందర్భంగా ఆమె ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ కోరిక, ధృఢమైన సంకల్పం, సాధించాలనే తపన ఉంటే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చని వివరిస్తున్నారు. ఎంసీఏ (MCA) పూర్తి చేసిన తనకు ఇద్దరు పిల్లలని, వారిని పెంచడం, ఇంటి బాధ్యతలు చూసుకోవడం, తన భర్తకు వ్యాపారంలో సహకరించడంతో పనులు సరిపోయేవన్నారు. కానీ తన లక్ష్యాన్ని ఎప్పుడూ మరవలేదన్నారు.
అందాల పోటీల్లో భారత్కు మరో కిరీటం - ఎవరీ మిస్ టీన్ యూనివర్స్ తృష్ణా రే?
కాలేజీలో ఉండగా తనకు అందాల పోటీల్లో పాల్గొనాలనే కోరిక ఉండేదన్నారు. కానీ తన భర్త రూపేష్ సహకారంతో మొదటి సారిగా 2023లో మిసెస్ ఇండియా తెలంగాణ-2023 పోటీల్లో పాల్గొని రన్నరప్గా నిలిచానన్నారు. ఆ తరువాత 2024లో మిసెస్ ఇండియా పోటీల్లో గౌరవనీయ విజేతగా కిరీటం గెలుపొందానన్నారు. పోటీలకు వయసు, శరీరాకృతితో సంబంధం ఉండదంటున్నారీ మిసెస్ ఇండియా రన్నరప్.
రత్నా మెహెతాకు పెళ్లై 20 ఏళ్లు పూర్తయిందని, ఇద్దరు పిల్లలున్నరని చెప్పుకొచ్చారు. తన అబ్బాయిల్లో పెద్దబాబు తొమ్మిదో తరగతి చదువుతుండగా, చిన్నబాబు నాలుగో తరగతి చదువుతున్నారన్నారు. తండ్రిదు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం కాగా, ఆయన వ్యాపారరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారన్నారు. రాజమహేంద్రవరం మెట్టినిల్లు కావడంతో గోదావరి జిల్లాతో అనుబంధం ఎక్కువని చెబుతున్నారీవిడ. మహిళలు ఏదైనా సాధించాలనుకుంటే కుటుంబ సహకారం తప్పని సరి అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతీ మహిళల తను అనుకున్నది సాధించడం కోసం కృషి చెయ్యాలని, పట్టుదల ఉంటే ఆశయ సాధన తత్యమని తెలుపుతున్నారీ నారీమణి.