Jagan Corruption on Limestone Mining: పాలించే వారు మనవారైతే గనులు, భూగర్భ వనరులను నిక్షేపంగా దోచేయొచ్చని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ జమానాలో జగన్ బ్యాచ్ నిరూపించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెగబడింది. ఉన్నతాధికారులూ వారితో అంటకాగారు. జగన్ కంపెనీల్లోకి నిధుల ప్రవాహానికి సహకరించారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ చేసిన కుంభకోణాలపై సీబీఐ పెట్టిన కేసుల్లో దాల్మియా సిమెంట్స్ ఒకటి. ఈ సంస్థకు 407 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా కట్టబెట్టినందుకు జగన్ కంపెనీల్లోకి 95 కోట్ల రూపాయలు చేరాయని సీబీఐ వెల్లడించింది. 13 మందిని నిందితులుగా తేలుస్తూ దాఖలైన కేసు ఇప్పటికి 249 సార్లు వాయిదా పడింది.
వైఎస్ సీఎం అయ్యాక తెరపైకి : కడప జిల్లా మైలవరం మండలంలో 407 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కోసం పులివెందులకు చెందిన ఏవీ రాజ్యలక్ష్మి మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్న జయ మినరల్స్ సంస్థ 1997లో గనుల శాఖకు దరఖాస్తు చేసింది. సరైన వివరాలు లేకపోవడం, దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో ఆ కంపెనీయే లేకపోవడంతో అప్పటి ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టింది. వైఎస్ 2004లో సీఎం అయ్యాక అదే దరఖాస్తు మళ్లీ తెరపైకి వచ్చింది. సజ్జల దివాకర్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భగీరథి డైరెక్టర్లుగా ఉన్న ఈశ్వర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రంగంలోకి దిగింది.
జయ మినరల్స్ను తాము టేకోవర్ చేశామని, ప్రాస్పెక్టింగ్ లైసెన్సును జయ మినరల్స్కు బదులుగా ఈశ్వర్ సిమెంట్స్ పేరిట ఇవ్వాలని సజ్జల దివాకర్రెడ్డి 2004 అక్టోబరులో గనుల శాఖను కోరారు. మరోవైపు ఈశ్వర్ సిమెంట్స్ పేరిట మూడు నెలల్లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్, తర్వాత మైనింగ్ లీజులు సంపాదించాలని, తర్వాత వాటిని దాల్మియా సిమెంట్స్కు బదిలీ చేయాలని 2006 ఏప్రిల్ 12న సజ్జల దివాకర్రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియాలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కుట్రలో భాగంగా పునీత్ దాల్మియా తన ఉద్యోగి టుగ్నైట్ను 2006 ఆగస్టు 18న ఈశ్వర్ సిమెంట్స్లో డైరెక్టర్గా దింపి సిమెంట్ పరిశ్రమ స్థాపించే బాధ్యతను అప్పగించారు.
గతంలోనే దరఖాస్తును తిరస్కరించారని తెలిసీ గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడీ రాజగోపాల్ మూడు నెలల వ్యవధిలో ఈశ్వర్ సిమెంట్స్కు బదిలీ చేయాలన్న షరతుతో జయ మినరల్స్ పేరిట ప్రాస్పెక్టింగ్ లైసెన్సును మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. పరిశ్రమల శాఖ నాటి కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఆ ఫైల్ను గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పంపించగా ఆమె అనుమతించారు. దీంతో జయ మినరల్స్కు 407.05 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలపై ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ను మంజూరు చేస్తూ శ్రీలక్ష్మి 2006 జులై 14న జీవో ఇచ్చారు. ఇలా జగన్, వైఎస్ల ప్రభావంతో అప్పటి మంత్రి సబిత, అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది సీబీఐ అభియోగం.
అవినీతితో జగన్ దోస్తీ - తండ్రి హయాంలో భారీగా అక్రమాలు
ప్రభుత్వం నుంచి జీవో రాగానే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాస్పెక్టింగ్ లైసెన్సును ఈశ్వర్ సిమెంట్స్ పేరిట బదిలీ చేయాలని 2006 ఆగస్టు 23న గనుల శాఖకు దరఖాస్తు సమర్పించారు. సిమెంట్ పరిశ్రమను ఈశ్వర్ సిమెంట్స్ ఏర్పాటు చేస్తుందని అంతకుముందే సజ్జల దివాకర్రెడ్డి గనుల శాఖకు 2006 ఆగస్టు 18న తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు సీబీఐ వివరించింది. తర్వాత ఈశ్వర్ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న పునీత్ దాల్మియా ఉద్యోగి టుగ్నైట్ సున్నపురాయి మైనింగ్ లీజు కోసం 2007 ఫిబ్రవరి 15న దరఖాస్తు చేశారు.
సిమెంట్ పరిశ్రమకు అదే ఏడాది ఏప్రిల్ 20న ఈశ్వర్ సిమెంట్స్ శంకుస్థాపన చేసినట్లు నివేదిక పొందారు. వాస్తవానికి ఆ రోజున వైఎస్ శంకుస్థాపన చేసింది దాల్మియా సిమెంట్స్దేనని సీబీఐ తెలిపింది. కార్యక్రమానికి జగన్ కూడా హాజరైనట్లు వెల్లడించింది. సిమెంట్ ప్లాంటు ఈశ్వర్ సిమెంట్స్ది కాదని తెలిసినా రాజగోపాల్ నోట్ పంపించగా శ్రీలక్ష్మి, సబిత దాన్ని ఆమోదించారు. ఇలా ఈశ్వర్ సిమెంట్స్కు 30 ఏళ్లపాటు సున్నపురాయి మైనింగ్ లీజును ఇస్తూ 2008 జనవరి 9న జీవో ఇచ్చారు. మైనింగ్ లీజును దాల్మియా సిమెంట్స్కు బదిలీ చేయాలంటూ ఈశ్వర్ సిమెంట్స్ దరఖాస్తు చేసింది.
ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ను, మైనింగ్ లీజులను లాభాల కోసం ఇతరులకు విక్రయించరాదు. లీజుల బదిలీలో ఎలాంటి ఆర్థిక లబ్ధి లేదంటూ వి.డి.రాజగోపాల్ తప్పుడు నివేదిక తెప్పించి ప్రభుత్వానికి సమర్పించడంతో సున్నపురాయి మైనింగ్ లీజులను దాల్మియా సిమెంట్స్ పేరిట 2008 డిసెంబరు 18న బదిలీ చేశారు. అయితే ఈశ్వర్ సిమెంట్స్ను టేకోవర్ చేసేందుకు దాల్మియా సిమెంట్స్ 3.75 కోట్ల మేర చెల్లించింది. ఇందులో ఈశ్వర్ సిమెంట్స్కు 2.14 కోట్ల అక్రమంగా లబ్ధి జరిగినట్లు సీబీఐ నిర్ధారించింది. రఘురాం సిమెంట్స్ లిమిటెడ్లో జగన్కు చెందిన సిలికాన్ బిల్డర్స్, సండూర్ పవర్ 2006 అక్టోబరులో వాటాలు పొందాయి.
ఏపీఎండీసీ నిధులపై జగన్ సర్కార్ కన్ను - 700 కోట్లు పక్కదారి పట్టించేందుకు సన్నద్ధం
పెట్టుబడుల పేరుతో ముడుపులు కుట్ర: 2006 డిసెంబరు 1న రఘురాం సిమెంట్స్లో జగన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ కంపెనీ పేరును 2010 సెప్టెంబరు 1న భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు. ఇందులో వైఎస్ భారతీరెడ్డి 2010 డిసెంబరు 26 బోర్డు ఆఫ్ డైరెక్టర్స్గా చేరారు. మరోవైపు లైసెన్స్, లీజుల ఫైళ్లు కదులుతున్న కొద్దీ పునీత్ దాల్మియా నుంచి జగన్కు లబ్ధి చేకూరిందని సీబీఐ వివరించింది. రఘురాం సిమెంట్స్లో పెట్టుబడుల ముసుగులో దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్ 2007 మార్చి 28 నుంచి 2009 ఆగస్టు 5 వరకు ఆరు విడతల్లో 95 కోట్లను పొందినట్లు వెల్లడించింది. సిమెంట్ ఉత్పత్తిలో అనుభవమున్న దాల్మియా సిమెంట్స్ షేరు ధర 40 ఉండగా అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న రఘురాం/భారతీ సిమెంట్స్ షేర్లను 1440తో కొనుగోలు చేయడం వెనుక ముడుపులు కుట్ర దాగుందని సీబీఐ వివరించింది.
హవాలా మార్గంలో జగన్ వద్దకు: రఘురాం సిమెంట్స్ నుంచి కొన్న షేర్లను ఫ్రాన్స్కు చెందిన పర్ ఫిసిమ్ సంస్థకు 2010 ఏప్రిల్లో దాల్మియా సిమెంట్స్ అమ్మేసింది. పర్ ఫిసిమ్తో విజయసాయిరెడ్డి సంప్రదింపులు జరిపారని, ఈ లావాదేవీలో దాల్మియాకు రూ.146.58 కోట్లు వచ్చాయని, అందులో పన్నులు పోగా మిగిలిన 139 కోట్లు హవాలా మార్గంలో మళ్లీ జగన్కే చేరినట్లు సీబీఐ వివరించింది. ఆదాయ పన్ను శాఖ సోదాల్లో దాల్మియా సంస్థ మేనేజర్ జోయ్దీప్ బసు వద్ద లభించిన పెన్డ్రైవ్ హవాలా లావాదేవీల గుట్టురట్టు చేసింది. అందులోని వివరాల ప్రకారం ‘జేఆర్ అకౌంట్’ అంటే జగన్మోహన్రెడ్డికి 55 కోట్లు హవాలా మార్గంలో చేరాయని, మరో 84 కోట్ల బ్యాలెన్స్ ఉందని తేలింది. అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రాథమిక విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో 2011 జూన్ నుంచి లావాదేవీలు నిలిచిపోయాయని సీబీఐ వెల్లడించింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో లంచాల పర్వం...పైకం చెల్లిస్తేనే పౌర సేవలు..!
పెన్డ్రైవ్లో బట్టబయలు: '2010 డిసెంబరు 31 నాటికి 3500 టన్నుల స్టాక్ అందింది. మరో 5000 టన్నుల స్టాక్ 2011 జనవరి 3 నాటికి పంపిస్తామని మీరు హామీ ఇచ్చారు' అని విజయసాయిరెడ్డి పంపించిన ఈ-మెయిల్ ప్రతిని పెన్డ్రైవ్లో సీబీఐ గుర్తించింది. దాని ప్రకారం 2010 డిసెంబరు 31నాటికి 35 కోట్లు, 2011 జనవరి 3 వరకు మరో 5 కోట్ల చెల్లింపులు జరిగాయని సీబీఐ తెలిపింది. ‘విజయసాయి గారూ నిన్నటివరకు 11.25 కోట్ల రూపాయల చెల్లింపులు పూర్తయ్యాయి ‘జె’తో కన్ఫర్మ్ చేయించండి అని పునీత్ దాల్మియా చేసిన ఎస్ఎంఎస్ కూడా పెన్డ్రైవ్లో లభించింది. హైదరాబాద్ పార్టీకి 2011వ ఆర్థిక సంవత్సరంలో నెలకు 1.25 కోట్ల చొప్పున 15 కోట్ల చెల్లింపు’ అనే మరో ఆధారాన్ని కూడా సీబీఐ గుర్తించింది.
హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో 2013 ఏప్రిల్ 8న అభియోగపత్రం దాఖలైంది. ఇందులో ఏ1గా జగన్ను, ఏ2గా వి.విజయసాయిరెడ్డిని, ఏ3గా పునీత్ దాల్మియాను, ఏ4 సబితా ఇంద్రారెడ్డిని, ఏ5గా వై.శ్రీలక్ష్మితోపాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది. ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో ఇప్పటివరకు 249 సార్లు వాయిదా పడింది. పునీత్ దాల్మియా క్వాష్ పిటిషన్ వేయడంతో హైకోర్టు 2016లో విచారణపై స్టే విధించింది. ఫలితంగా విచారణ చాలాకాలం నిలిచిపోయింది. హైకోర్టు 2021లో స్టే ఎత్తివేయడంతో విచారణ మళ్లీ కొనసాగింది.
యావజ్జీవ జైలుశిక్ష: నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అభియోగాల నమోదు జరగాల్సి ఉంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు ఛార్జిషీటు వేయలేదు. గతంలో పలుమార్లు ఛార్జిషీట్ సమర్పించినా సాంకేతిక కారణాలతో న్యాయస్థానం వెనక్కి పంపింది. సీబీఐ నమోదు చేసిన ఐపీసీ 120(బి) రెడ్విత్ 420, 409, 420, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9, 12, 13(2) రెడ్విత్ 13(1)(సి)(డి) ప్రకారం నేరం రుజువైతే నిందితులకు యావజ్జీవ జైలుశిక్ష పడే అవకాశముంది. రెండేళ్ల జైలుశిక్ష పడితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష అనుభవించిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు.