IPS Transfers in AP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కీలకమైన ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జగన్ అస్మదీయులకు కీలక పోస్టింగ్లో స్థానం కల్పించింది. 30 మంది అధికారుల పోస్టుల్లో మార్పులు చేర్పులు చేసింది. కీలకమైన ఎన్నికల సమయంలో వారు ఆయా పోస్టింగ్ల్లోనే కొనసాగనున్నారు. వైకాపాతో అంటకాగిన అధికారులకు కీలక స్థానాలే దక్కాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నిఘా విభాగం ఐజీ కొల్లి రఘురామ్రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతిగా నియమించింది. డైరెక్టర్ జనరల్ స్థాయి హోదా కలిగిన అధికారులను మాత్రమే ఈ పోస్టుకు ఎంపిక చేస్తారు. కానీ ఐజీ హోదా కలిగిన రఘురామ్ రెడ్డికి డీజీ ర్యాంకు పోస్టు కట్టబెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్కు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను సైతం రఘురామిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్సీపీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆయనకు ఈ పోస్టింగు దక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీకి కొమ్ముకాసిన మరికొందరు అధికారులకు సైతం కీలక పోస్టులు దక్కాయి. కర్నూలు రేంజి డీఐజీగా నియమితులైన సీహెచ్. విజయారావు 2021-2023 మధ్య నెల్లూరు జిల్లాలో ఎస్పీగా పని చేశారు. వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనలో వైఎస్సార్సీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. చోరీ కేసులో ఆధారాలు తారుమారు చేశారన్న విమర్శలూ ఉన్నాయి. అధికార పార్టీ నాయకులతో కలిసి వేధించడంతో పలువురు దళితులు ఆత్మహత్యలు చేసుకోగా, కొందరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అలాంటి అధికారికి కర్నూలు రేంజ్ డీఐజీగా బాధ్యతలు ఇచ్చారు.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు.. అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు
విశాఖ రేంజీ డీఐజీగా నియమితులైన విశాల్ గున్నీ సైతం 2020-22 మధ్య కాలంలో గుంటూరు ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించిన వారిపై లాఠీఛార్జీకి పాల్పడ్డారు. ప్రస్తుతం విజయవాడ డీసీపీగా వ్యవహరిస్తున్న ఆయన ఇటీవల అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమాన్ని తీవ్రంగా అణిచిచేశారు. అందుకు ప్రతిఫలంగానే అత్యంత కీలకమైన విశాఖ రేంజీ డీఐజీగా నియమించారన్న విమర్శలున్నాయి.
కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న పల్లె జాషువా అత్యంత వివాదాస్పద అధికారి. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అరాచకాలకు కొమ్ముకాశారు. బాధితులపైనే అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టిన ఘనచరిత్ర ఆయన సొంతం. మాజీ మంత్రి పేర్నినాని, ఆయన కుమారుడు కిట్టూతో అంటకాగారు. ఈయన హయాంలోనే గుడివాడలో కేసినో నిర్వహించారు. అలాంటి అధికారికి చిత్తూరు జిల్లా ఎస్పీగా కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వంలో నెంబర్ 2గా చెలామణి అవుతున్న ఓ మంత్రి ఏరికోరి ఆయన్ను అక్కడికి రప్పించుకున్నారని తెలిసింది.
IPS Officers Transferred in AP: ఏపీలో 11 మంది ఐపీఎస్ల బదిలీ.. ఎవరెవరంటే..?
అనంతపురం ఎస్పీగా ఉన్న సమయంలో అధికార పార్టీకి అన్నివిధాల సహకరించిన ఫకీరప్పకు కీలకమైన విశాఖ జాయింట్ కమిషనర్ పోస్టింగ్ దక్కింది. హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంలో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది ఫకీరప్పే.
విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీగా నియమితులైన ఆనందొడ్డి సైతం వైఎస్సార్సీపీ అనుకూలురనే ముద్ర ఉంది. విశాఖలో పని చేసిన కాలంలో వైఎస్సార్సీపీ నేతలకు సహకరించారు. ఇప్పుడు మరోసారి కీలక పోస్టింగ్ దక్కించుకున్నారు. మరో వివాదాస్పద అధికారి రిషాంత్రెడ్డి సైతం కీలక పోస్టు చేజిక్కించుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెబితే అదే చేసిన ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేసి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమించారు. దీంతో పాటు తిరుపతి కేంద్రంగా పని చేస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక కార్యదళం ఎస్పీగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ పోస్టులో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగే చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో విస్తృతంగా తిరగొచ్చు. ఎన్నికల్లో ఆయన సేవలను పరోక్షంగా వాడుకునేందుకే అధికార పార్టీ ఆయన్ను ఈ స్థానంలో నియమించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
![రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ల బదిలీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-01-2024/20621415_ips2.jpg)
![రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ల బదిలీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-01-2024/20621415_ips.jpg)
Adoni ASP పట్టుబట్టారు.. అరగంటలో ఐపీఎస్ బదిలీ.. చర్చాంశనీయంగా ఆదోని ఏఎస్పీ వ్యవహారం