Confusions in AP DSC Applications: నాలుగున్నరేళ్లు నిద్రపోయి ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దాని నిర్వహణను ప్రభుత్వం గందరగోళం చేస్తోంది. అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ల రోస్టర్ వరకు అడుగడుగునా అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తోంది. పరీక్షలకు సరిపడా సమయం లేక ఓ పక్క, అప్లికేషన్లలో ఇబ్బందులు, రిజర్వేషన్ల రోస్టర్లో గందరగోళంతో అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇప్పటికే డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని పోస్టులకు పరీక్షల నిర్వహణలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతి అంశంలోనూ గందరగోళానికి తావిస్తోంది. మాజీ సైనిక ఉద్యోగులు, క్రీడా కోటా, మహిళలు, దివ్యాంగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 2న జీఓ 77 జారీ చేసింది. అందులో కొత్త రిజర్వేషన్ రోస్టర్ను ప్రకటించింది. వీరికి హారిజంటల్ రిజర్వేషన్ పాటించాలని, సమాంతర రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని సూచించింది. కానీ, డీఎస్సీలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టులకు సమాంతర రోస్టర్ పాయింట్లు ఇచ్చారు.
డీఎస్సీకి అభ్యర్థులకు జగన్ సర్కార్ షాక్ - మరోసారి రుసుము కట్టాలని సూచన
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోకుండా పాయింట్లు ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం కొన్ని జిల్లాలో హారిజంటల్, మరికొన్ని జిల్లాల్లో రోస్టర్ పాయింట్లు రిజర్వేషన్ అమలు చేశారు. ఎస్ఏ, సెకండరీ గ్రేడ్ టీచర్లకు కొన్ని జిల్లాలు ఒక విధానాన్ని పాటించగా, మరికొన్ని జిల్లాలు మరో విధానాన్ని పాటించాయి. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాళ్లకు పాత రిజర్వేషన్ రోస్టర్ పాటించారు.
ఒక్క డీఎస్సీలోనే రెండు విరుద్ధ రిజర్వేషన్ల విధానం పాటించారు. ప్రభుత్వం పాటిస్తున్న ఈ రోస్టర్ విధానం వల్ల కొందరు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. జిల్లా, జోన్ల వారీగా రిజర్వేషన్ పోస్టులు ప్రకటించాల్సి ఉండగా రోస్టర్ పాయింట్ల వారీగా ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఒక జిల్లాలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకే అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు: నిరుద్యోగుల ఆందోళన
ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 3 - 5 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న సిలబస్, 6-10 తరగతులకు పాత సిలబస్, ద్విభాషా పాఠ్యపుస్తకాలను అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. డీఎస్సీకి వచ్చేసరికి కేవలం టాపిక్స్ మాత్రమే ఇచ్చింది. టెట్కు 20 రోజులు సమయం ఇవ్వగా ఆ తర్వాత డీఎస్సీకి ఐదు రోజులే మిగిలి ఉంది. టెట్కు సన్నద్ధమైన విద్యార్థులు ఆ పరీక్ష రాసిన తర్వాత ఐదు రోజుల్లోనే డీఎస్సీ ఎలా రాయగలుతారు.
టెట్ కోసం చదివిన సిలబస్కు డీఎస్సీకి సిలబస్కు కొంత వ్యత్యాసం ఉంది. దరఖాస్తుల సమర్పణకు గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. తరచూ సర్వర్ మొరాయించి, వెబ్సైట్ పని చేయకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు రుసుము ఆన్లైన్లో చెల్లిస్తున్నా ఐడీ రాక కొంతమంది రెండు, మూడు పర్యాయాలు రుసుము చెల్లించాల్సి వస్తోంది.
"స్పెషల్ డీఎస్సీ ద్వారా ప్రత్యేక ఉద్యోగాలు లేనప్పుడు - టెట్ 1బీ, 2బీ ఎందుకు నిర్వహించారు"
డీఎస్సీకి మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటా చూపించలేదు. కొందరికి పరీక్ష కేంద్రం కనిపించలేదు. స్థానిక జిల్లా మాత్రమే అడగటంతో దాన్ని నమోదు చేశారు. ఈ లోపాలను సవరించుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్ ఐచ్ఛికం ఇవ్వలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో 30 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. ఇప్పుడు వీరందరూ మళ్లీ దరఖాస్తు చేయాలా. లేదంటే ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా అనేదానిపై స్పష్టత లేదు. ఈనెల 22వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనున్నందున ఈ అంశాలపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన - జగన్కు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక