Cold Intensity Raised in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండడంతో చలిగాలులు బలంగా వీస్తున్నాయి. దాంతో స్థానికులు గజగజ వణుకుతున్నారు. చింతపల్లిలో 5 పాయింట్ 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యాటకులు స్థానికులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎక్కడికక్కడ మంటలు వేసుకుని వెచ్చదనాన్ని పొందుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే చిన్నపిల్లులు, వృద్ధులు హడలెత్తిపోతున్నారు. సంక్రాంతి తర్వాత వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలో సోమవారం అత్యల్పంగా జి.మాడుగులలో 5.4 డిగ్రీలు, గూడెంకొత్తవీధిలో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యధికంగా కొయ్యూరులో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ పరిశోధన విభాగం అధికారులు తెలిపారు.
అలాగే పెదబయలులో 5.8, డుంబ్రిగుడలో 6, పాడేరులో 6.1, అరకులోయలో 6.8, చింతపల్లిలో 7.3, ముంచంగిపుట్టులో 7.8, హుకుంపేటలో 8.3, అనంతగిరిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం వరకూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.