గోల్డెన్ ఛాన్స్! - కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం - VIZAG TO VIJAYAWADA NEW FLIGHTS
విశాఖపట్నం - విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులు - విశాఖ టు విజయవాడ మధ్య తిరగనున్న ఎయిరిండియా, ఇండిగో విమానాలు - కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం!


Published : Oct 27, 2024, 7:02 PM IST
Rammohan Naidu Inaugurates Vizag to Vijayawad Airline Services : విశాఖపట్నం టు విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం విశాఖ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసును ప్రారంభించారు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ విశాఖలో ఉదయం 9:35 గంటలకు బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయల్దేరి 9 గంటలకు విశాఖపట్నానికి చేరుతుంది. ఇండిగో సర్వీసు రాత్రి 7:15 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 8:20కి విశాఖకు చేరుతుంది.
అదే సర్వీసు మళ్లీ విశాఖ నుంచి రాత్రి 8:45కు బయల్దేరి 9:50కి విజయవాడ చేరుకుంటుంది. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ టు విజయవాడ మధ్య నడచే విమాన సర్వీసుల సంఖ్య మూడుకు చేరనుంది. విశాఖ టు విజయవాడ మధ్య ఫ్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది కోరారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు విమానాల సర్వీసులు ప్రారంభం కావడం ఇదే మొదటిసారని, ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ మార్గంలో రెండు సర్వీసులను ప్రారంభించామని పేర్కొన్నారు. రెండు నగరాల మధ్య ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో విమాన టికెట్ల ధరలు సైతం తగ్గుతాయని, విశాఖ, విజయవాడ మధ్య రూ.3 వేలకే టికెట్ దొరికే అవకాశం ఉందని తెలిపారు.
కొత్త ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు : విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం అని, అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే కనెక్టవిటీ ఎంతో అవసరమని, విశాఖ-గోవా మధ్య విమాన సర్వీసులను సైతం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అత్యధిక కనెక్టివిటీలు ఉండేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నామని, ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని సైతం అక్కడ నిర్మించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ఏపీలో కొత్త ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాల్లో బాంబులు పెట్టామన్న బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారిని శిక్షించడంతో పాటు భారీగా జరిమానా వేస్తామని తెలిపారు. ఈ మేరకు చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు విమానాల్లో బాంబులు పెట్టామన్న బెదిరింపులపై విచారణ జరగుతోందని తెలిపారు.