64 Year Old Man Married a 68 Year Old Woman in Rajamahendravaram : జీవితంలో ఒంటరితనాన్ని ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు అనుభవించే ఉంటారు. చేతినిండా సంపాదన ఉన్నా ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. సంతోషం కలిగించే తోడు లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏదో లోటు మనసును కుదురుగా ఉండనివ్వదు. ఇక వృద్ధుల్లో ఆ బాధ వర్ణనాతీతం. చిన్నపిల్లల్లా చెప్పుకోలేరు. అలా అని బాధను దిగమింగలేరు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కొందరు ధైర్యం చేస్తున్నారు. మలివయస్సులో తమ హృదయంతో పెనవేసుకునే బంధం కోసం వెతుకుతున్నారు. అడ్డంకులను దాటుకుని జంటగా ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పెళ్లి బంధంతో కొత్త బంధాలను ఏర్పరుచుకుంటున్నారు. రాజమహేంద్రవరంలోని ఓ వృద్ధాశ్రమంలో చోటు చేసుకున్న ఘటన పెళ్లికి ఆస్తి-అంతస్తు కాదు తోడు కావాలని నిరూపించింది.
వయసైపోయి వృద్ధాశ్రమంలో ఉన్న వారిద్దరికీ మనసులు కలిశాయి. వయసులో ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఒకరికి ఒకరి తోడు ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. తామిద్దరం ఇష్టపడ్డామని, పెళ్లి చేసుకుంటామని నిర్వాహకులకు చెప్పారు. అంతే, ఆ ఆశ్రమం కళ్యాణమండపంలా సందడిగా మారింది. అక్కడ ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారి వారిద్దరినీ ఒకటి చేశారు. రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఈ పెళ్లికి వేదికైంది.
వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ(68), రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన మడగల మూర్తి(64) ఇద్దరూ ఈ ఆశ్రమంలో ఉంటున్నారు. రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్న మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు. ఎవరో ఒకరి సాయం తప్పనిసరి. ఆ సమయంలో రాములమ్మ సహకారంతో మూర్తి కోలుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో శుక్రవారం వీరికి పెళ్లి చేయించారు .
వెలితి తీరేలా - తోడు ఉండేలా - 'పెద్దల స్వయంవరం'
కాలంతో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవహారిక జీవితంలోను మార్పులకు యువతే ముందుకు వస్తున్న సంఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. గతంలో రెండో పెళ్లి లేదా పెద్దలకు వివాహాలు అంటే అంతా వింతగా చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒంటరితనంతో కొంతమంది పడుతున్న మానసిక వేదనను గుర్తించి తోడును వెతికే పని చేస్తోంది పౌర సమాజం. కరోనా సమయంలో అనేక మంది తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల కారణంగా కట్టుకున్న వారు దూరమైన వారు, పిల్లల జీవితాలను తీర్చిదిద్దాలనే బాధ్యతల్లో మునిగి మరో వివాహం గురించి ఆలోచించని వారు కూడా ఎంతో మంది ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు పెళ్లి వద్దనుకుని ఒంటరిగా మిగిలిపోయిన వారు, వివాహం జరిగి భాగస్వామి దూరమై పెద్దలు మనోవేదనకు గురవుతున్నారు.
వివాహాలు చేస్తున్న పిల్లలు: జీవిత ప్రమాణాలు పెరిగి ఉద్యోగ విరమణ చేశాక మొదలయ్యే జీవితంలో పాతికేళ్ల పాటు ఆరోగ్యంగా ఉంటున్నారు. అందుకే ఈ వయసులో తమకు తోడును ఎవరు వెతుకుతారని వారే పెళ్లిచూపులకు వెళ్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పిల్లలే దగ్గర ఉండి తమ తల్లి లేదా తండ్రికి వివాహం చేస్తున్న ఘటనలు తరచూ వార్త ప్రపంచంలో వెలుగు చూడటం మార్పుకు నాంది అంటున్నారు మరికొందరు.
84 వెడ్స్ 66- గ్రాండ్గా వృద్ధ జంట పెళ్లి- భార్య మరణాన్ని తట్టుకోలేక! - OLD COUPLE MARRIAGE