Virat Kohli T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసి మూడు రోజులు అయ్యింది. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం ఇంకా అదే ఫీవర్లో ఉన్నారు. ఫ్యాన్సే కాదు క్రికెటర్లు కూడా ఆ హ్యాపీ మూమెంట్స్ను ఆస్వాదిస్తున్నారు. మరికొందరేమో పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా బార్బడస్ స్టేడియంలో తాను రోహిత్తో తీసుకున్న ఓ ఫొటో గురించి ప్రస్తావించి ఎమోషనలయ్యారు. ఆ ఫొటో తీసుకొనడానికి వెనక ఉన్న కథను వివరించారు.
మ్యాచ్ గెలుపు తర్వాత సంబరాల్లో ఉన్న రోహిత్ సేన, తమ ఆత్మీయులతో కలిసి ఆ సంతోషాన్ని పంచుకుంటూ కనిపించారు. ఈ ఆనంద క్షణాలను అక్కడి కెమెరా మెన్లు కూడా క్లిక్మనిపించారు. సరిగ్గా అప్పుడే రోహిత్, కోహ్లీ జాతీయజెండాను తమ భుజాలపై కప్పుకుని ట్రోఫీతో ఫొటో దిగారు. ఆ తర్వాత రోహిత్ శర్మ తన కుమార్తె ను భుజాలపైకి ఎత్తుకుని, విరాట్తో ఫోటో దిగాడు. అయితే ఈ ఐకానిక్ ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. వరల్డ్ కప్తో ఇద్దరం కలిసి ఫొటో దిగుదామని రోహిత్ను అతడే కోరినట్లు కోహ్లీ వివరించాడు.