Sravana Masam Prasadam Recipes: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు, శివుడు, శ్రీ హరి ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతుంటాయి. శివ భక్తులు శివ మాల ధరించి, శివ భజన, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాదు.. వివాహిత మహిళలు వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ రోజున నైవేద్యాలు సమర్పిస్తారు. ఉపవాసం ఉంటారు. అయితే.. ఈ సారి అమ్మవారికి వీటిని నైవేద్యంగా సమర్పించండి. ప్రసాదాలు అవే అయినా.. చేసే పద్ధతి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది.
సగ్గుబియ్యం క్యారెట్ పాయసం :
కావాల్సిన పదార్థాలు :
- సన్న సగ్గుబియ్యం - 1 కప్పు
- క్యారెట్ తురుము - 1 కప్పు
- నీళ్లు - నాలుగు కప్పులు
- బెల్లం - ఒకటిన్నర కప్పు
- నెయ్యి - తగినంత
- యాలకుల పొడి - 1 స్పూన్
- చిటికెడు - ఉప్పు
- కాచి చల్లార్చిన పాలు - అర లీటర్
- జీడిపప్పు - 10
- బాదం పలుకులు - కొద్దిగా
- కిస్మిస్ - 10
తయారీ విధానం:
- ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో సన్న సగ్గుబియ్యం వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నాలుగు కప్పులు నీళ్లు పోసి పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి మెత్తగా అయ్యేవరకు మగ్గించుకుని ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్లో సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా పోసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
- సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి బెల్లం వేసుకుని బెల్లం కరిగేంతవరకు కలిపి ఆ తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి యాలకుల పొడి, ఉప్పు వేసి మరోసారి బాగా కలుపుకుని ఆ తర్వాత ఓ నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిశ్రమం చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసుకుని కలిపి పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే పాన్ పెట్టి అందులో నాలుగు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పలుకులు, కిస్మిస్ వేసుకుని ఫ్రై అయిన తర్వాత వాటిని సగ్గుబియ్యం మిశ్రమంలో నెయ్యితో సహా కలుపుకుంటే సరి.. టేస్టీ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం రెడీ.
నెయ్యి పూర్ణం బూరెలు :
కావాల్సిన పదార్థాలు :
- పచ్చి శనగపప్పు - కప్పు
- బెల్లం - 1 కప్పు
- పసుపు - పావు టీ స్పూన్
- ఉప్పు - చిటికెడు
- నీళ్లు - తగినన్ని
- యాలకుల పొడి - అర టీ స్పూన్
- నెయ్యి - తగినంత
- దోశ పిండి - తగినంత
తయారీ విధానం :
- ముందురోజు రాత్రే దోశపిండిని సిద్ధం చేసుకోవాలి.
- పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి ఓ నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత కుక్కర్ తీసుకుని అందులో పప్పు వేసుకుని.. అది మునిగే వరకు నీళ్లు పోసుకుని, అందులోకి పసుపు, ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
- పప్పు ఉడికిన తర్వాత అందులోని నీరు పోయేందుకు పప్పును జల్లెడలో వేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఉడికించుకున్న పప్పు వేసి కలుపుకోవాలి.
- బెల్లం కరిగి పప్పు చుట్టూ పట్టిన తర్వాత యాలకుల పొడివేసి దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి.
- మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి.
- నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా దోశ పిండి వేసుకుని.. పిండి మధ్యలోకి ముందే రెడీ చేసుకున్న శనగపప్పు ఉండలను పెట్టి ఆపైన మరోసారి దోశపిండి వేసుకుని మూత పెట్టి ఓ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత మూత తీసి రెండో వైపు తిప్పుకుని ఆవైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. అలా మిగిలిన ఉండలను కూడా అలానే చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
శ్రావణమాసం స్పెషల్ : పక్కా కొలతలతో గుడిలో పెట్టే "పరమాన్నం" - నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!
దద్దోజనం:
కావాల్సిన పదార్థాలు:
- ఉడికించిన అన్నం - 2 కప్పు
- పెరుగు - ఒకటిన్నర కప్పు పెరుగు
- ఉప్పు - ఒక స్పూన్
- మిరియాల పొడి - అర స్పూన్
- నూనె - తగినంత
- ఎండుమిర్చి - 3
- పచ్చి శనగపప్పు - 1 టీ స్పూన్
- ఆవాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- అల్లం తరుగు - 1 టీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూన్
- ఇంగువ - చిటికెడు
- కరివేపాకు - 2 రెమ్మలు
- నెయ్యిలో వేయించిన జీడిపప్పు - 10
తయారీ విధానం :
- ముందుగా ఉడికించిన అన్నంలో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు.
- ఆ తర్వాత అందులోకి ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడెక్కిన తర్వాత ఎండు మిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి అల్లం ముక్కలు, సన్నగా కట్చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
- తర్వాత ఇంగువ, కరివేపాకు వేసుకుని చిటపటలాడేంతవరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి కలుపుకోవాలి. చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసుకుంటే సరి..
ఇవీ చదవండి:
శ్రావణ మాసంలో మంగళ గౌరీ పూజ చేస్తున్నారా? మరి వ్రత కథ గురించి తెలుసా?
దీర్ఘ సుమంగళిగా ఉండటం కోసం శ్రావణ 'మంగళ గౌరీ వ్రతం'- పూజ ఎలా చేయాలో తెలుసా?