CM Revanth On Telangana Cabinet Expansion : దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షాలు పలు శాఖలకు మంత్రులు లేరని ఆరోపిస్తున్నారన్న రేవంత్, విద్యాశాఖ తన వద్దే ఉందని తెలిపారు. ఒక నిర్దిష్ట ప్రణాళికా ప్రకారం ముందుకెళ్తున్నామని వివరించారు. దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా ఉన్నారో లేరో చూడాలని ప్రతిపక్షాలకు సూచించారు. అభివృద్ధి పనుల కోసం మంత్రులు కేంద్రమంత్రులను కలుస్తున్నారని తెలిపారు. 6 సంక్షేమ పథకాలను అమలు చేయడమే ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో పలు శాఖలకు మంత్రులు లేరని ఆరోపిస్తున్నారు. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులున్నారు. విద్యా శాఖ నా వద్దే ఉంది. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా ఉన్నారో లేరో చూడాలి. అభివృద్ధి పనుల కోసం మంత్రులు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఆరు సంక్షేమ పథకాలను అమలు చేయడమే ధ్యేయం. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి నిర్ణయించాం. - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపులపై స్పందించిన సీఎం, ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అని ఆక్షేపించారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ లాక్కున్నారన్న రేవంత్, ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్ అన్నారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీశ్ మాటలకు అప్పట్లో బీజేపీ వంతపాడిందన్నారు.