History Behind Names of Districts in Telugu States : చరిత్ర గమనిస్తే మనం నివసించే ప్రాంతానికి ఆ పేరు పెట్టడం వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో పేరు పెట్టడం వెనుక అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, అక్కడ దొరికే పదార్థాలు, భౌగోళిక స్వరూపం, పరిపాలించిన రాజుల పేర్లు వంటి వివిధ అంశాలు కారణం కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మనం పిలుచుకునే కొన్ని జిల్లాల పేర్లు ఒకప్పుడు వేరే పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఇంతకీ ఆ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఏవీ? వాటికి ఆ పేర్లు పెట్టడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
బెజవాడ :
విజయవాడని బెజవాడ అంటారని మనలో చాలా మందికి తెలుసు! ఈ ప్రాంతానికి బెజవాడ పేరు రావడం వెనుక ఓ చరిత్ర ఉంది. అదేంటంటే పూర్వం కృష్ణవేణి (కృష్ణా నది) బంగాళాఖాతం సముద్రంలో కలవడం కోసం ఈ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కృష్ణవేణి నదికి పర్వతాలు అడ్డంగా వచ్చాయి. దీంతో కృష్ణమ్మ అర్జునున్ని వేడుకోగా అప్పుడు అర్జునుడు ఆ పర్వతాలకు రంధ్రం (బెజ్జం) చేశాడట. దీంతో అప్పటి నుంచి ఈ ప్రాంతానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చింది. అనంతరం అది బెజవాడగా మారి విజయవాడగా మారింది.
గర్తపురి :
మిర్చి అనగానే మనందరికీ ఘాటుగా ఉండే గుంటూరు మిర్చి గుర్తుకొస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని గర్తపురిగా పిలిచేవారు.
గడప :
కొన్నేళ్ల క్రితం ఎవరైనా తిరుమల వెళ్లాలంటే గడప ప్రాంతం మీదునే వెళ్లేవారట. ఈ ప్రాంతం తిరుమలకు ద్వారంగా ఉండేదని చెబుతుంటారు. కాలక్రమంలో గడప కాస్త కడప జిల్లాగా మారింది.
కోకనాడ :
డచ్ వారు భారత దేశాన్ని పరిపాలించిన సమయంలో ఇక్కడి నుంచే కొబ్బరి కాయలను విదేశాలకు తరలిచేవారు. ఈ ప్రాంతాన్ని ఆ కాలంలో కోకో నాడ అని పిలిచేవారు. దగ్గరలో కోరింగ నదికి ఓడరేవు ఉండడం వల్ల కోరింగ అనే పేరు కూడా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాకినాడగా మారింది.
వాల్తేరు :
ఇప్పుడు వైజాగ్గా (విశాఖపట్టణం) పిలిచే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు వాల్తేరు అని పిలిచేవారు. వాల్తేరు అనేది ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ సంస్కృతిక, మానవ హక్కుల పరిరక్షకుడు, సామాజిక విప్లవకారుడి పేరు. ఆయన అప్పట్లో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారట! అందుకే ఆయన పేరు మీదుగానే వైజాగ్కు వాల్తేరు అనే పేరు వచ్చిందట!
విక్రమ సింహపురి :
పెన్నా నది పక్కనే ఉండే నెల్లూరు జిల్లాను ఒకప్పుడు విక్రమ సింహపురిగా పిలిచేవారు. ఇప్పుడు నెల్లూరుగా మనం పిలుస్తున్నాం.
భావపురి :
బాపట్ల జిల్లాలో భావ నారాయణస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని భావపురిగా పిలిచేవారు. కాలక్రమంలో భావపురి బాపట్లగా మారింది.
సిక్కోలు (చికాకొల్) :
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాగా మనం పిలుచుకునే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు సిక్కోలు అని చికాకొల్ అనే పేర్లతో పిలిచేవారు.
కందెనవోలు :
కందెన అంటే వాహనాలకు పెట్టే గ్రీజు అని అర్థం. ఒకప్పుడు ఎద్దుల బండ్లకు ఈ ప్రాంతంలో ఉన్న తుంగ భద్ర నది వద్ద గ్రీజు పెట్టేవారట. దీంతో ఈ ప్రాంతాన్ని కందెనవోలు అని పిలిచేవారట. ఇప్పుడు అదే ప్రాంతాన్ని కర్నూల్గా పిలుచుకుంటున్నాం.
రాజమండ్రి :
రాజమండ్రిని ఒకప్పుడు రాజమహేంద్రవరంగా పిలిచేవారు. తర్వాత పేరు రాజమండ్రిగా మారింది. కానీ, 2015లో మళ్లీ దీనికి రాజమహేంద్రవరం అని పేరు మార్చారు.
'తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు! - అనూహ్యంగా మారుతున్న వాతావరణం'
తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలు :
భాగ్యనగరం :
మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగమతి అనే నృత్యకారిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు మీదుగానే హైదరాబాద్కు భాగ్యనగరం అని పేరు వచ్చిందట. అనంతరం ఈ ప్రాంతం హైదర్ మహల్ అని గుర్తింపు పొందింది. తర్వాత భాగ్యనగరం పేరు హైదరాబాద్గా మారింది.
పాలమూరు :
పూర్వం నిజాం కాలంలో ఇక్కడ ఉండే ప్రజలు పాలు అమ్మేవారట. అందుకే ఈ ప్రాంతానికి పాలమూరు అని పేరు వచ్చింది. అనంతరం నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అస్ఝా-VI పేరు మీదుగా ఈ ప్రాంతానికి మహబూబ్నగర్ అని పేరు వచ్చింది. ఆనాటి నుంచి అదే పేరుతో ఈ ప్రాంతం కొనసాగుతోంది.
ఓరుగల్లు :
మనం వరంగల్గా పిలిచే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఓరుగల్లుగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఏకశిలా నగరం, ఓమటికొండ అనే పేర్లతోనూ పిలిచేవారు. వరంగల్ కోటను ఒకే శిలపై నిర్మించడంతో ఏకశిలా నగరం అని పేరు వచ్చింది.
గమనిక : జిల్లాలు, పట్టణాల పేర్ల వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకున్నా గత పాలకులు వాటికి నామకరణం చేసినట్లుగా పలు చరిత్ర పుస్తకాలు, చరిత్ర పరిశోధకులు తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. పలువురు చరిత్రకారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇక్కడ ఇవ్వడం జరిగిందని పాఠకులు గుర్తుంచుకోవాలి.
రోజూ అరగంటే ఛాన్స్ - ఆ తర్వాత ఈ అందాల దీవి మునిగిపోతుంది!
రోజుకు ఎవరెన్ని నీళ్లు తాగాలో తెలుసా? - అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే!