Yahya Sinwar Last Moments : హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ బలగాలు విడుదల చేశాయి. దక్షిణ గాజాలోని ఓ శిథిలమైన భవనంలో సోఫాలో సిన్వర్ తీవ్రంగా గాయపడి కదల్లేని స్థితిలో కూర్చుండిపోయినట్లు అందులో కనిపిస్తోంది. ఆ దృశ్యాల్ని దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైనికులు డ్రోన్ ఎగరేసి రికార్డు చేశారు. డ్రోన్ను చూసిన సిన్వర్ ఓ కర్రలాంటి వస్తువును కష్టంగా దానిపై విసిరాడు. ఆపరేషన్ సమయంలో సిన్వర్ సైనిక దుస్తులు, బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉన్నారు.
సిన్వర్ను చంపింది ట్రైనీ సైనికులే!
యాహ్యా సిన్వర్ను చంపింది ట్రైనీ సైనికులే కావడం గమనార్హం. నిఘా సంస్థ మొసాద్, సీనియర్ కమాండర్లు ఏడాదిగా సిన్వర్ను తీవ్రంగా గాలించినా అతడి ఆచూకీని కూడా కనిపెట్టలేకపోయారు. నెలలుగా ఆచూకీ తెలియకపోవడం వల్ల అతడు మృతి చెందినట్లు తొలుత భావించారు. ఈ నేపథ్యంలో దక్షిణ గాజాలో సాధారణ పెట్రోలింగ్ చేస్తుండగా భవంతి నుంచి ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే భారీ బాంబులను ఐడీఎఫ్ సైనికులు భవనంపై ప్రయోగించగా కాల్పులు ఆగిపోయాయి. దళాలు అక్కడికి చేరుకోగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఉంది సిన్వర్ అని దాడి సమయంలో ఐడీఎఫ్కు తెలియదు. రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ అందులో సిన్వర్ ఉన్నట్లు గుర్తించాయి. చూపుడు వేలును కత్తిరించి డీఎన్ఏ పరీక్ష చేసి నిర్ధరణ చేశాయి. మరోవైపు సిన్వర్ను హతమార్చిన యువసైనికులు యుద్ధం ప్రారంభమైనప్పుడు సైన్యంలోనే లేరు. 9 నెలల క్రితమే ప్రభుత్వం పిలుపు మేరకు తమ దేశం కోసం ఆర్మీలో చేరారు. వారందరూ 19 నుంచి 21 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.
Raw footage of Yahya Sinwar’s last moments: pic.twitter.com/GJGDlu7bie
— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 17, 2024
వేటాడి మరీ హతమరుస్తాం!
సిన్వర్ మరణంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ తమ ఆయుధాలను వదిలి, తమ బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తామని పేర్కొన్నారు. పౌరులను వదిలిన హమాస్ బలగాలకు స్వేచ్ఛ కల్పిస్తామన్నారు. లేదంటే వేటాడి మరీ హతమారుస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఇరాన్ నిర్మించిన ఉగ్రవాద నెట్వర్క్ కూలిపోతోందని తెలిపారు. ఇరాన్ తమ సొంత ప్రజలతో పాటు ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ ప్రజలపై విధించిన ఉగ్రపాలన కూడా త్వరలో ముగుస్తుందని అన్నారు. ఇది యావత్ ప్రపంచానికే మంచి రోజని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్ బందీలను విడిపించేందుకు హమాస్కు ఇదో అవకాశమన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదులు న్యాయం నుంచి తప్పించుకోలేరని మరోసారి రుజువైందన్నారు.
ప్రతిఘటన స్ఫూర్తి బలపడుతుంది!
సిన్వర్ను చంపడంపై హెజ్బొల్లా తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్పై పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించింది. అటు ఇరాన్ కూడా తమ ప్రతిఘటన బలోపేతం అవుతుందని ఐక్యరాజ్యసమితికి తెలిపింది. ఇజ్రాయెల్ ఆక్రమణల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని యుద్ధభూమిలో శత్రువుని ఎదుర్కొన్న అమరవీరుడు సిన్వర్ను చూస్తే ప్రతిఘటన స్ఫూర్తి బలపడుతుందని తెలిపింది. పాలస్తీనా విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే యువత, పిల్లలకు అతను ఒక మోడల్ అవుతాడని పేర్కొంది.