India Hits Back At Pakistan : ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద ఘటనల్లో పాకిస్థాన్ వేలిముద్రలు కనిపిస్తున్నాయని భారత్ మండిపడింది. పాక్ సుదీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్పై ఆయుధంగా ఉపయోస్తోందని వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్పై పాకిస్థాన్ మరోసారి అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో, మన దేశ దౌత్యవేత్త భవిక మంగళానందన్ గట్టిగా బదులిచ్చారు.
'అలాంటి దేశం భారత్ గురించి మాట్లాడమా?'
"దురదృష్టవశాత్తు ఈ ప్రపంచ వేదికగా అవాస్తవాలను వినాల్సి వచ్చింది. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల వ్యాపారం, అంతర్జాతీయ నేరాలకు పాకిస్థాన్ ప్రపంచ ఖ్యాతి గడించింది. అలాగే మిలిటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాకిస్థాన్, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమా? పాక్ సుదీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఆయుధంగా ఉపయోస్తోంది. భారత్లోని పార్లమెంట్, ముంబయి, వాణిజ్య సముదాయాలు, పవిత్ర ప్రదేశాలపై దాడి చేసింది పాకిస్థానే. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్థాన్ హింస చాలా ఉంది. అలాంటి దేశం హింస గురించి మాట్లాడటం వంచనే అవుతుంది" అని భవిక మంగళానందన్ ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
భారత్పై అక్కసు వెళ్లగక్కడంలో ఆశ్చర్యం లేదు
భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని భవిక మంగళానందన్ వ్యాఖ్యానించారు. అల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్కు దీర్ఘకాలంగా ఆతిథ్యం ఇచ్చిన దేశం పాకిస్థాన్ అని విమర్శించారు. పవిత్రమైన ఐరాస హాలులో పాక్ ప్రధాని షెహబాజ్ ఇలా భారత్పై అక్కసు వెళ్లగక్కడంలో ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ మరిన్ని అబద్ధాలతో సత్యాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుందని భారత్కు తెలుసని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యపై తమ వైఖరి స్పష్టంగా ఉందని వెల్లడించారు.
#WATCH | At UNGA Indian diplomat Bhavika Mangalanandan replies to Pakistani PM Shehbaz Sharif, says, " this assembly regrettably witnessed a travesty this morning. a country run by the military, with a global reputation for terrorism, narcotics, trade and transnational crime has… pic.twitter.com/ZpHxE6a5Py
— ANI (@ANI) September 28, 2024
"ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం(పాక్) ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. వాస్తవమేంటంటే ఆ దేశం భారత్ భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది. పాకిస్థాన్ 1971లో మైనార్టీలపై మారణహోమానికి పాల్పడింది. ప్రస్తుతం కూడా మైనారిటీలను నిర్ధాక్షిణ్యంగా వేధిస్తోంది. అలాంటి దేశం ప్రస్తుతం భారత్లో ఉన్న అసహనం, భయాందోళనల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. పాకిస్థాన్ నిజస్వరూపం ఏంటో ప్రపంచానికి తెలుసు"
- భవిక మంగళానందన్, భారత దౌత్యవేత్త
ఐరాస జనరల్ అసెంబ్లీ సెషన్లో సాధారణ చర్చ సందర్భంగా ఊహించినట్లుగానే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జుమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఆర్టికల్ 370 రద్దు గురించి కూడా మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలేసిన షరీఫ్, కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా మాట్లాడారు. పాలస్తీనా మాదిరిగానే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలన్నారు. దీనితో భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ పాకిస్థాన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.