Union Budget 2025 Highlights : పేద మధ్యతరగతి ఆశలను మోస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో 2025-26 సవంత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఈ బడ్జెట్ తీసుకొచ్చామని సీతారామన్ ప్రకటించారు. ఈ బడ్జెట్లో పన్ను సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన, పెట్టబడులు, ఉపాధి కల్పన వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. పన్ను సంస్కరణల్లో భాగంగా కొత్త ట్యాక్స్ స్లాబ్లను ప్రకటించింది. రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారిని పన్ను నుంచి మినాహాయించింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలపై కేంద్ర దృష్టి పెడుతూనే అన్ని రంగాల్లో సమతౌల్యత, వ్యవస్థాపకత పెంపొందించడం, మధ్యతరగతికి సాధికారత కల్పించేలా బడ్జెట్ను రూపొదించింది. ఈ 2025 బడ్జెట్లో కీలక అంశాలు ఇవే.
మౌలిక వసతుల కల్పన
- ఐఐటీలను విస్తరించడం : 6500 మంది విద్యార్థుల విద్యావకాశాలు కల్పించేలా 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులను ప్రభుత్వం మెరుగుపరచనుంది. ఐఐటీ పాట్నాలో మొదటగా అభివృద్ధి పనులు చేస్తారు.
- రిజినల్ కనెక్టివిటీ : సవరించిన ఉడాన్ పథకం ద్వారా మరో 120 ప్రాంతాలకు విమాన సౌకర్యాన్ని విస్తరిస్తారు. తద్వారా వచ్చే నాలుగేళ్లలో విమాన ప్రయాణికుల రద్దీ నాలుగు రెట్లు పెరుగుతుంది. ఇది ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.
- బిహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల ఏర్పాటుకు కేంద్రం సహాయం. పట్నా ఎయిర్పోర్టు, బిహ్టా ఎయిర్పోర్టుల విస్తరణ.
- రాబోయే 5 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను కేంద్రం ఏర్పాటు చేయడం.
- భారత్నెట్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం.
- విద్యా రంగంలో ఆర్టఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ సంస్థను ఏర్పాటు చేయడం. దీని కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయడం.
- మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలకు మద్దతు - మూలధన పెట్టుబడి, సంస్కరణల కోసం 50ఏళ్ల వడ్డీ లేని రుణాల కోసం రూ.1.5 లక్షల కోట్లు ప్రతిపాదన
- చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (SMR) పరిశోధన, అభివృద్ధి కోసం రూ.20,000 కోట్ల వ్యయంతో అణుశక్తి మిషన్ ఏర్పాటు. తద్వారా 2033 నాటికి దేశీయంగా అభివృద్ధి చేయబడిన 5 SMRలు పనిచేయనున్నాయి.
- స్వామి నిధి 2 - ప్రభుత్వం, బ్యాంకులు, ప్రైవేట్ పెట్టుబడిదారుల సహకారంతో మరో లక్ష డ్వెల్లింగ్ యూనిట్లను త్వరగా పూర్తి చేయడం లక్ష్యంగా రూ.15,000 కోట్లు కేటాయింపు
- అంతర్జాతీయ వాణిజ్యం ఏకీకృత ట్రేడ్ డాక్యుమెంటేషన్, ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ కోసం భారత్ ట్రేడ్నెట్ను ఏర్పాటు చేయడం
పన్ను సంస్కరణలు
- పన్ను చెల్లింపులు సులభతరం చేసేందుకు ట్యాక్స్ స్లాబ్లను కేంద్రం సవరించింది. సవరించిన పన్ను స్లాబ్స్ ఇవే
సవరించిన పన్ను స్లాబ్స్ (FY 2025-26) | |
రూ.0-4 లక్షలు | నిల్ |
రూ.4-8 లక్షలు | 5 శాతం |
రూ.8-12 లక్షలు | 10 శాతం |
రూ.12-16 లక్షలు | 15 శాతం |
రూ.16-20 లక్షలు | 10 శాతం |
రూ20- 24 లక్షలు | 25 శాతం |
రూ.24 లక్షలకు పైగా | 30 శాతం |
- ఎంత పన్ను ఆదా చేసుకోవచ్చు?
ఆదాయం | పొదుపు | ఎఫెక్టివ్ రేటు |
రూ. 12 lakh | రూ. 80,000 | 0 శాతం |
రూ. 16 lakh | రూ. 50,000 | 7.5 శాతం |
రూ. 20 lakh | రూ. 90,000 | 10 శాతం |
రూ. 50 lakh | రూ 1.1 lakh | 21.6 శాతం |
- ద్రవ్య లోటు: ద్రవ్యలోటు GDPలో 4.4 శాతంగా ఉంటుందని అంచనా
డిజిటల్ ఎకానమీ, ఇన్నోవేషన్
- స్టార్టప్ల కోసం రూ.10 వేల కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు. స్టార్టప్ల ఇన్కార్పోరేషన్ సమయం ఐదేళ్లకు పెంపు
- సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల- ఎమ్ఎస్ఎమ్ఈ కంపెనీలకు రూ.10కోట్ల కవరేజ్ పెంపు
- ఉద్యం పోర్టల్లో రిజిస్టర్ అయిన సూక్ష్మ కంపెనీలకు రూ.5 లక్షల లిమిట్తో క్రెడిట్ కార్డులు జారీ చేయడం. మొదటి సంవత్సరంలో 10 లక్షల కార్డులు జారీ చేస్తారు.
ఆరోగ్యం, విద్యా రంగాలు
స్థిరమైన ఆర్థిక వృద్ధికి- ఆరోగ్యకరమైన, విద్యావంతులైన జనాభా ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగా మెడికల్ సీట్లను విస్తరించింది. వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లను జోడించిదలచినట్లు బడ్జెట్లో ప్రకటించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా ఆస్పత్రుల్లో డేకేర్ క్యాన్సర్లను మూడేళ్లలో ఏర్పాటు చేసేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. మరోవైపు క్యాన్సర్, దీర్ఘకాలిక, అరుదైన వ్యాధులకు ఉపయోగపడే 36 రకాల డ్రగ్స్, ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించింది.
రైతులు, వ్యవసాయం
- ఉత్పాదకతను పెంపొందించడం, రైతులకు మద్దతు ఇవ్వడానికి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా బిహార్లో మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ను మెరుగుపరచడానికి కొత్త బోర్డు ఏర్పాటు చేయనుంది.
- ప్రధాన మంత్రి ధన్ ధని కృషి యోజన : తక్కువ ఉత్పాదకత కలిగిన 100 జిల్లాలను కవర్ ఈ పథకం చేస్తుంది. 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, పంచాయతీ స్థాయిలో నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం.
గ్రీన్ గోత్
పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి పలు నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. అందులో భాగంగా ఈవీ బ్యాటరీ తయారీకి కావాల్సిన ముడి వస్తువులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించింది. దీంతో సెల్ తయారీ కర్మాగారుల నెలకొల్పడం సులభం అవుతుంది. అది భారత ఈవీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుంది. భారత్లో 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తిని అభివృద్ధి చేయాలని కేంద్రం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించింది.
ప్రజా సంక్షేమం
ప్రత్యక్ష సంక్షేమ కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు మద్దతు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ సేవల కోసం తాత్కాలికంగా ఉపయోగించుకొనే గిగ్ వర్కర్ల సంఖ్య 2030 నాటికి 2.3 నుంచి 3 కోట్లకు చేరనున్నట్లు అంచనా. ఆర్థిక వ్యవస్థలో వీరికున్న ప్రాధాన్యం దృష్ట్యా వీరికి ఐడీ కార్డుల జారీ, ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్కు కేంద్రం అనుమతించింది. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్యబీమా పొందనున్నారు. దీంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరనున్నట్లు అంచనా. పీపీపీ పద్ధతిలో సామాజిక భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, మహిళలకు సాధికారత కల్పించడానికి దేశంలోని 5 లక్షల మంది ఎస్టీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు రాబోయే ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు రుణాలను మంజూరు చేయనున్నారు.
విదేశీ పెట్టుబడులు, వాణిజ్యం
ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని మెరుగుపరచడానికి ఈ బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను పెంచడం, ఎగుమతులకు మద్దతు ఇవ్వడంపై కేంద్ర దృష్టి సారించింది. అందులో భాగంగా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ బీమా రంగానికి ఎఫ్డీఐ పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచింది. ఇక ఎగుమతి విధానాలను క్రమబద్ధీకరించడానికి, ఎగుమతిదారులకు క్రెడిట్ యాక్సెస్ను మెరుగుపరచడానికి ఎగుమతి ప్రమోషన్ మిషన్ కేంద్రం ఏర్పాటు చేయనుంది.