దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఉదయం జీవనకాల గరిష్ఠాలను తాకాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడం, ఆసియా మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుండడమే అందుకు కారణం. ప్రస్తుతం ఆటో, పీఎస్యూ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు రాణిస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 318 పాయింట్లు పెరిగి 84,862 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 120 పాయింట్లు వృద్ధి చెంది 25,911 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ హై రికార్డ్ను క్రాస్ చేసింది.
అదే కారణం!
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) శుక్రవారం రూ.14,064.05 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్ 18న కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలిపారు.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై, హాంకాంగ్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి.
ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.75 శాతం పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 75.05 డాలర్లుగా ఉంది.
రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ 5 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47గా ఉంది.