Siddique Murder Case Shooter Arrest : మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిఖీపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షూటర్ శివకుమార్తోపాటు మరో నలుగురిని ఉత్తర్ప్రదేశ్లోని బహ్రాయిచ్లో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు నేపాల్కు పారిపోయేందుకు యత్నించినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు షూటర్లలో శివ ఒకడు. ఘటనానంతరం పరారయ్యాడు. ఈ క్రమంలోనే ఉత్తర్ప్రదేశ్ ఎస్టీఎఫ్తో కలిసి ముంబయి పోలీసులు ఆదివారం శివకుమార్తోపాటు అతడికి ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురిని అరెస్టు చేశారు. నిందితుడికి ఆశ్రయంతో పాటు నేపాల్ పారిపోయేందుకు సహకరించినందుకు కశ్యప్, జ్ఞాన్ ప్రకాశ్ త్రిపాఠి, ఆకాశ్ శ్రీవాస్తవ, అఖిలేంద్ర ప్రతాప్ సింగ్ అనే నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో తనకు సంబంధం ఉందని విచారణలో అతడు అంగీకరించాడని, అన్మోల్ బిష్ణోయ్ సూచనల మేరకే ఈ హత్య చేసినట్లు చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడే అన్మోల్. బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు ముంబయి పోలీసులకు ఇటీవల సమాచారం అందింది. అతడి కదలికలకు సంబంధించిన వివరాలను ముంబయి పోలీసులతో అమెరికా పంచుకుంది. దీంతో అతడిని భారత్కు రప్పించే ప్రయత్నాలను పోలీసులు ముమ్మరం చేశారు.
అక్టోబరు 12న బాబా సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ధర్మరాజ్ కశ్యప్తో శివ్కుమార్ గౌతమ్ అనే ముగ్గురు నిందితులు సిద్ధిఖీని కాల్చి చంపినట్లు పోలీసులు గతంలో పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు తామే కారణమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా ప్రకటించుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 20 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.