Fish Struck In Boy Throat : ఛత్తీస్గఢ్లోని జాంజ్గీర్ చాంపా జిల్లాలో 14 ఏళ్ల బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన బాలుడి నోటిలోకి ప్రమాదవశాత్తు దూరిన చేప గొంతులో అడ్డంగా చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు చేపను బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. ఆ తర్వాత అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
అసలేం విషయమేమిటంటే?
జిల్లాలోని అకల్తరా పోలీస్స్టేషన్ పరిధి కరుమహు గ్రామానికి చెందిన సమీర్ గోడ్ స్నానం చేసేందుకు శుక్రవారం ఉదయం చెరువుకు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ఒక్కసారి ఓ చిన్న చేప సమీర్ నోటిలోకి ప్రవేశించి గొంతులో ఇరుక్కుపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చిన్నారి నోటి నుంచి చేపను బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బయటకు తీయలేకపోయారు.
వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి అకల్తరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడి గొంతులో ఇరుకున్న చేపను బయటకు తీయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత అతికష్టం మీద సగం చేపను బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషయమించడం వల్ల బిలాస్ పుర్లో ఉన్న సిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆ తర్వాత చిన్నారిని అతడి కుటుంబసభ్యులు అక్కడికి తరలించారు.
ముందస్తు సమాచారంతో సిమ్స్ వైద్యులు చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బాలుడు చేరుకున్న వెంటనే చికిత్స ప్రారంభించారు. చిన్నారి మెడ దగ్గర చిన్న రంధ్రం చేసి చేపను విజయవంతంగా బయటకు తీశారు. ఆ తర్వాత అబ్జర్వేషన్లో ఉంచారు. బాలుడి గొంతు నుంచి 8 సెంటీమీటర్ల చేపను బయటకు తీశామని డాక్టర్ రామ్ కృష్ణ కశ్యప్ తెలిపారు. సిమ్స్ వైద్యులకు సమీర్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.
ఇటీవల ఉత్తర్ప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన ఓ యువకుడు పళ్లు తోముకున్న తర్వాత ప్రమాదవశాత్తు స్టీల్ టంగ్ క్లీనర్ మింగేశాడు. దీంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. అనంతరం ఆ యువకుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ లింక్పై క్లిక్ చేయండి.