Arunachal Pradesh Election Results 2024 : అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ మరోసారి విజయం సాధించింది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను సొంతం చేసుకుంది. మొత్తం 60 స్థానాల్లో 46 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ దాటింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పార్టీ శ్రేణులు ఈటానగర్తో సహా పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు.
10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం
ఏప్రిల్ 19న మొదటి దశ లోక్సభ ఎన్నికలతో పాటు 50 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు. మొత్తం 50 స్థానాల్లో బీజేపీ 36 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నేనషల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు జూన్ 4నే వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. కానీ ఆదివారంతో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండటం వల్ల కౌంటింగ్ను రెండు రోజుల ముందు ఏర్పాటు చేసింది.
పొంచౌ వక్కా స్థానంలో మంత్రి హోన్చుంగ్ 4వేల ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థిపై విజయం సాధించారు. నాచో నియోజకవర్గంలో 1,373 ఓట్లతో పర్యటక శాఖ మంత్రి నకప్ నాలో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. టోపిన్ ఈటే చేతిలో 1,951 ఓట్ల తేడాతో ఎన్పీపీ అభ్యర్థి ఓడిపోయారు. కొలోరియాంగ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి 10 వేల ఓట్ల తేడాతో పీపీఏ అభ్యర్థిపై గెలుపొందారు. దోయిమఖ్ నియోజకవర్గంలో పీపీఏ అభ్యర్థి నబమ్ వివేక్ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై 2,530 ఓట్ల తేడాతో గెలుపొందారు. తవాంగ్లో ఎన్పీపీ అభ్యర్థి నామ్గే త్సెరింగ్ బీజేపీ అభ్యర్థిని ఓడించారు.
2019 అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకొని రెండోసారి అధికారం చేపట్టింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) మూడు స్థానాలను కైవసం చేసుకుంది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ రెండు, ఎన్సీపీ, కాంగ్రెస్, ఇతరులు ఒక్కొక్క స్థానాల్లో గెలిచారు.