తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2020, 9:30 AM IST

ETV Bharat / state

గొంతులో బియ్యం పోసి.. నోట్లో వస్త్రాలు కుక్కి హత్యాచారం

ఆమె గొంతులోనే కాదు ఊపిరితిత్తుల నిండా బియ్యపు గింజలే. నోట్లో వస్త్రాలు కుక్కిన ఆనవాళ్లు. సామూహిక అత్యాచారానికి గురై అర్ధనగ్నంగా, అపస్మారక స్థితిలో పడి ఉంది. అర్ధరాత్రో.. అపరాత్రో.. ఎప్పుడు జరిగిందో ఆ దురాగతం. నరకం అనుభవించిన ఆ మహిళ చివరకు నిస్సహాయంగా తనువు చాలించింది. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ అమానుష చర్య చోటు చేసుకుంది.

woman rapedy by unknown persons at ongole
బియ్యం వేసి, బట్టలు కుక్కి... అత్యాచారం చేసి చంపేశారు

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో కేశవరాజుకుంట ప్రాంతం నుంచి పాత జాతీయ రహదారికి వెళ్లే దారిలో.. ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. వారు వచ్చి 108 వాహనంలో బాధితురాలిని రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమెను నిర్జన ప్రదేశంలోకి ఎవరు తీసుకువెళ్లారు. అక్కడ ఏం జరిగింది? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఘటనా స్థలంలో ఆమె దుస్తులు, చెప్పులు, సంతనూతలపాడు నుంచి ఒంగోలుకు ప్రయాణించినట్లుగా బస్సు టిక్కెటు, స్థానిక థియేటర్‌లో మంగళవారం రాత్రి మొదటి ఆట సినిమా టిక్కెట్లు దొరికాయి. సంఘటనా స్థలంలో నల్లపూసల దండతో పాటు మరికొన్ని వస్తువులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నిందితులెవరు..?

హతురాలిది ఒంగోలు శ్రీనగర్‌ కాలనీగా పోలీసులు గుర్తించారు. పేర్నమిట్టకు చెందిన ఈమె కొన్నాళ్ల క్రితం భర్తతో విడిపోయి శ్రీనగర్‌ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి... తిరిగి ఇంటికి చేరలేదని విచారణలో వెల్లడైంది.

ఆ బియ్యం ఎక్కడివి..

బాధితురాలిని ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఊపిరితిత్తులు, జీర్ణాశయంలో బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే నేర స్థలాన్ని పోలీసులు సందర్శించినప్పుడు అక్కడ ఎక్కడా బియ్యం జాడ కనిపించలేదు. మద్యం తాగి ఆ మత్తులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ విషయం బయటకు వస్తుందనే నెపంతో ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి: మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details