తెలంగాణ

telangana

By

Published : Aug 14, 2021, 5:31 AM IST

Updated : Aug 14, 2021, 8:45 AM IST

ETV Bharat / state

కృష్ణా, గోదావరి బోర్డుల తదుపరి కార్యాచరణపై ఆసక్తి

కృష్ణా, గోదావరి బోర్డుల తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసి నెల రోజులు గడిచింది. నోటిఫికేషన్​లో పేర్కొన్న బాధ్యతలు నిర్వర్తించేందుకు 30 రోజుల గడువులోగా సంస్థాగత స్వరూపాన్ని ఖరారు చేయాల్సి ఉంది. రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి సమాచారం అందని నేపథ్యంలో బోర్డులు ఏమిచేస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది. అటు నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిపై గోదావరి బోర్డు రెండు రాష్ట్రాలను ఆరా తీసినట్లు తెలిసింది.

krmb and grmb
krmb and grmb

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల అంశంపై ఏర్పాటైన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని కేంద్రం గత నెలలో ఖరారు చేసింది. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి రెండు బోర్డుల పరిధికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జులై 15న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 14 నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందన్న కేంద్రం... ఆలోగా అమలు కార్యాచరణ ఖరారు చేయాలని, అందుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

అందని సమాచారం..

కేంద్ర ఆదేశాల నేపథ్యంలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమన్వయ కమిటీల చేంజ్ ఏర్పాటు చేశాయి. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు కోసం ఈ నెల మూడో తేదీన కమిటీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఈ నెల తొమ్మిదో తేదీన రెండు బోర్డులు ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించాయి. రెండు సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు గైర్హాజరయ్యారు. నోటిఫికేషన్ అమలు కోసం అవసరమైన వివరాలు, సమాచారం ఇవ్వాలని రెండు రాష్ట్రాలను బోర్డులు కోరాయి. గెజిట్​లోని కొన్ని అంశాలకు సంబంధించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని... వాటిని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో బోర్డులకు రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు, సమాచారం అందలేదు.

బోర్డుల నిర్ణయంపై నెలకొన్న ఆసక్తి

నోటిఫికేషన్​లో పేర్కొన్న ప్రకారం అమలు, పర్యవేక్షణ కోసం రెండు బోర్డులు 30 రోజుల్లోపు సంస్థాగత స్వరూపాన్ని ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది. అందుకు అనుగుణంగా కేంద్రం అధికారులను నియమిస్తుంది. అయితే సంస్థాగత స్వరూపం ఖరారు గడువు ముగిసిప్పటికీ ఆ ప్రక్రియ ఏ మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ఇప్పుడు బోర్డులు ఏం చేస్తాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. అటు ఇతర అంశాలకు సంబంధించి కూడా బోర్డులు ఇప్పటికే రెండు రాష్ట్రాలకు లేఖలు రాశాయి. నోటిఫికేషన్​లోని వివిధ అంశాల అమలు కోసం సన్నద్ధతను గోదావరి బోర్డు ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు జీఆర్ఎంబీ తాజాగా లేఖ రాసినట్లు సమాచారం. కేఆర్ఎంబీ కూడా లేఖలు రాసే అవకాశం ఉంది.

త్వరలో సమావేశం

త్వరలో మళ్లీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. రెండు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు సంబంధించిన కార్యాచరణపై కృష్ణా, గోదావరి బోర్డులు చర్చించనున్నాయి. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు ఎవరెంత వినియోగించుకోవాలన్నది ఖరారు చేయాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలలో 2015-16వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకొనేలా తాత్కాలిక ఏర్పాటు చేసుకొని రెండు రాష్ట్రాల అధికారులు, కేంద్ర జల్‌శక్తి అధికారులు ఒప్పందానికి వచ్చారు. తర్వాత చిన్ననీటి వనరులు, గోదావరి నుంచి మళ్లించే 45 టీఎంసీలతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ 66 శాతం, తెలంగాణ 34 శాతం వినియోగించుకొనేలా ఏర్పాటు జరిగింది. ఈ ఏడాది తమకు 50 శాతం నీటిని కేటాయించాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ క్రమంలో నీటి వినియోగంపై నిర్ణయం కోసం బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

రాయలసీమ ఎత్తిపోతలపై...
రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించిన కృష్ణా బోర్డు కమిటీ జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు(ఎన్జీటీ) నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. పర్యావరణ అనుమతి లేకుండా పనులు చేయవద్దని ఎన్జీటీ ఆదేశించగా, దీనిని ఉల్లంఘించి పనులు చేపట్టినట్లు దాఖలైన ధిక్కార పిటిషన్‌ దాఖలైంది. దీనిని పరిగణనలోకి తీసుకొని వాస్తవ నివేదిక సమర్పించాలని కృష్ణా బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ సహకరించడం లేదంటూ చివరకు ఈ నెల 11న ఇద్దరు బోర్డు అధికారులు, దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జలసంఘం ప్రతినిధి కలిసి రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించారు. సోమవారం దీనిపై ఎన్జీటీలో విచారణ జరగనున్న నేపథ్యంలో శుక్రవారం కమిటీ నివేదికను పంపినట్లు తెలిసింది.

ఇదీ చూడండి:ఏపీలో కృష్ణా బోర్డు బృందం పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం

Last Updated : Aug 14, 2021, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details