తెలంగాణ

telangana

వసూళ్లులో ఘనం.. సౌకర్యాల్లో విఫలం.. ఇది ఔటర్​రింగ్​ రోడ్డు పరిస్థితి

By

Published : Oct 25, 2022, 11:28 AM IST

Hyderabad outer ring road: హైదరాబాద్ నగరానికి పలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు నుంచే ఎక్కువగా వస్తుంటాయి. విశాలమైన రోడ్డుతో పాటు.. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనుకునే వారికి ఔటర్ రింగ్ రోడ్డు ఎంతో ఉపయోగంగా ఉంది. అయితే ఓఆర్​ఆర్​పై ప్రయాణించే వారికి మాత్రం కనీస సౌకర్యాలు మాత్రం కనిపించడంలేదు. కనీసం మరుగుదొడ్లు కూడా.. ఔటర్ మధ్యలో లేదా ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద కూడా అందుబాటులో లేవు. ఏటా 500 కోట్ల వరకు టోల్‌ వసూళ్లు అవుతున్నా.. ప్రయాణికులకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో హెచ్​ఎండీఏ విఫలమౌతోంది.

outer ring road
outer ring road

వసూళ్లులో ఘనం.. సౌకర్యాల్లో విఫలం.. ఇది ఔటర్​రింగ్​ రోడ్డు పరిస్థితి

Hyderabad outer ring road: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్నారా.. అయితే ముందే జాగ్రత్త వహించండి. మరుగుదొడ్లకు వెళ్లాలనుకుంటే కష్టమే. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల విషయంలో అగచాట్లు తప్పడం లేదు. అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించామని హెచ్​ఎండీఏ గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ప్రయాణికులకు కనీస వసతులు కల్పించడంలో ఏళ్లుగా మీనమేషాలు లెక్కిస్తోంది.

ఏటా 500 కోట్ల ఆదాయం:నగరం చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు విస్తరించి ఉంది. దీని నిర్వహణ, అభివృద్ధి పనులను హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చూస్తోంది. నగరం నుంచి వెళ్లే వాహనాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కిందకు దిగేందుకు.. 19 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించారు. అవుటర్ ఎక్కే ప్రతి వాహనం నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. ఏటా 500 కోట్ల రూపాయలపైనే హెచ్​ఎండీఏకు ఆదాయం వస్తోంది.

రోజుకి 1.4లక్షల వాహనాలు రాకపోకలు: ఓఆర్​ఆర్​కి ఎక్కిన తర్వాత మళ్లీ ఇంటర్‌ఛేంజ్ వద్ద కిందకు దిగాలి. ఇక్కడే వాహనదారులు, డ్రైవర్లకు మరుగుదొడ్లతో సహా ఇతర సౌకర్యాలు కల్పించాలి. కానీ కనీస వసతులు అందుబాటులో లేవు. అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. సాధారణ ప్రయాణికులకు వీటిలోకి అనుమతించడం లేదు. ఔటర్ రింగ్ రోడ్డుపై నిత్యం 1.4 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

మరుగుదొడ్లు కరవు: ట్రక్కు డ్రైవర్లు నగరంలోకి వచ్చే ముందు కాలకృత్యాలు తీర్చుకొని, కాసేపు సేదతీరి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తుంటారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం అవుటర్నే ఉపయోగిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తుంటారు. అత్యవసర సమయంలో మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు.

కొన్నిసార్లు ప్రధాన క్యారేజ్ వేపైనే వాహనాలను ఆపుతున్నారు. దగ్గరకు వచ్చే వరకు ముందు వాహనం ఆగి ఉందన్న విషయం తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం పే అండ్ యూజ్ పద్ధతిలోనైనా మరుగుదొడ్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొత్తగా వస్తోన్న ట్రిబుల్‌ ఆర్‌ రోడ్డు పైన అయినా.. మరుగుదొడ్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details