Telangana Government Replaces Officials Postings :తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ ప్రభుత్వం స్థానంలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. కొత్తప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రస్థాయి పరిపాలన వ్యవస్థలో సమూలంగా మార్పులు రానున్నాయి. ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో పెద్దఎత్తున బదిలీలు, స్థానచలనం చోటుచేసుకోనున్నాయి. కొత్త సర్కారు ఏర్పడినప్పుడు సహజంగానే వారిఆలోచనలు, విధానాలకు అనుగుణంగా అధికారుల పోస్టింగులు ఉంటాయి.
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారుల పోస్టింగులు కొనసాగాయి. ఇప్పుడు ప్రభుత్వ మార్పుతో అధికారుల పోస్టుల్లో మార్పులు అనివార్యం కానున్నాయి. కొందరు అధికారులు సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్నారు. కొంతమంది అధికారులపైరేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. వాటన్నింటి నేపథ్యంలో త్వరలోనే భారీగా అధికారుల బదిలీలు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Telangana New Government Will Change Officials : కొందరు అధికారులకు రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి అంత ప్రాధాన్యకర పోస్టులు దక్కలేదు. ఈసారి పోస్టింగుల్లో తప్పకుండా ప్రాధాన్యం లభిస్తుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికారులు తమకు ఉన్న మార్గాల ద్వారా కొత్త సీఎం రేవంత్ రెడ్డి, ఆయనకు దగ్గరగా ఉండే వారిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. కొందరు అధికారులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటున్న హోటల్ వద్దకు వెళ్లారు. కొత్త ప్రభుత్వంలో ప్రాధాన్యకర పోస్టులివ్వాలని కోరుతున్నారు.
Congress New Government in Telangana 2023 :పోలీస్ శాఖలోనూ పెద్దఎత్తున మార్పులు చోటు చేసుకోనున్నాయి. డీజీపీ స్థాయి నుంచి సీఐ వరకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారుల్లో చాలామందికి స్థానచలనం తప్పదని పోలీస్శాఖలో చర్చసాగుతోంది. డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన అంజనీకుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్య పోస్టుల్లో ఉన్నారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఉన్న అంజనీకుమార్, హైదరాబాద్ సీపీగా దాదాపు నాలుగేళ్లపాటు కొనసాగారు. మహేందర్రెడ్డి పదవీ విరమణ చేశాక డీజీపీగా ఆయన బాధ్యతలు చేపట్టారు.