తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2020, 5:21 AM IST

ETV Bharat / state

మూసీని వదిలిన దుర్గంధం... భారీ వర్షాల వల్లే సాధ్యం

మూసీ నది అంటేనే హైదరాబాదీలు భయపడేవారు. ఆ వాసన, కాలుష్యానికి అటు వైపుగా వెళ్లాలంటేనే వణికిపోయేవారు. కానీ అది ఒకప్పటి పరిస్థితి. దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో మూసీ... మళ్లీ నది రూపును సంతరించుకుంది. ఎన్ని ప్రభుత్వాలు తలచుకున్నా వదలని దుర్గంధం... కుండపోత వర్షాలకు కనుమరుగవడం వల్ల మూసీ పరివాహక ప్రాంత ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నారు.

sewage is gone in moosi river due to heavy rains in hyderabad
మూసీని వదిలిన దుర్గంధం... భారీ వర్షాల వల్లే సాధ్యం

మూసీని వదిలిన దుర్గంధం... భారీ వర్షాల వల్లే సాధ్యం

నదీ ఆనవాళ్లు కోల్పోయి మురికి కూపంగా మారిన మూసీనది ఇటీవలి వర్షాలకు కొత్తరూపు సంతరించుకుంది. లంగర్‌హౌస్ వద్ద ఈసీ-మూసీ నదుల సంగమం అత్తాపూర్, పురాణాపూల్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, నాగోల‌్, ఉప్పల్ వరకు దాదాపు 50 కిలోమీటర్లు మేర హైదరాబాద్‌లో మూసీ నది ప్రవహిస్తోంది. మూసీకి ఆనుకుని ఉన్న బస్తీలు, కాలనీల్లో... వేలాది మంది నివాసం ఉంటున్నారు. వరదలతో వీరంతా ఇబ్బంది పడినా.. ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణంతో కాస్త సేదతీరుతున్నారు. దశాబ్దాలుగా మురుగు కంపును భరించామని.... ఇప్పుడు పరిశుభ్రమైన మూసీని చూస్తున్నామని చెబుతున్నారు. మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. గతంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్లాస్టిక్ కవర్లు, పిచ్చి మొక్కలతో మురుగు కంపు భరించలేని విధంగా ఉండేది. మూసీ నది ఇటీవల వరదలతో కడిగేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ఎలాంటి దుర్వాసన రావట్లేదని ప్రయాణికులంటున్నారు.

ఇప్పటికైనా పరిశుభ్రంగా ఉంచాలి

2000 సంవత్సరంలో మూసీ ప్రక్షాళనకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' ప్రాజెక్టును చేపట్టింది. నది మధ్యలో నుంచి మురుగునీరు వెళ్లేందుకు వరద కాలువను నిర్మించి... ఇరువైపులా నందనవనాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. మూసీని ఆక్రమించి నిర్మించిన బస్తీలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. బస్తీలను ఖాళీ చేయించడంపై మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా మూసీని పరిశుభ్రంగా ఉంచేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

మూసీ ప్రక్షాళన బాధ్యతలను తీసుకున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ తాజా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరిశుభ్రమైన నదిగా తీర్చిదిద్దాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.

ఇవీ చూడండి: తొలిరోజే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రూ.3200 కోట్ల ఆదాయం

ABOUT THE AUTHOR

...view details