తెలంగాణ

telangana

By

Published : Mar 9, 2020, 10:48 PM IST

Updated : Mar 9, 2020, 11:54 PM IST

ETV Bharat / state

రంగులు ఎగిసే... యువత మురిసే...

రాష్ట్ర వ్యాప్తంగా రంగుల హోలీ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. రంగుల వర్ణాల్లో తడిసి ముద్దవుతున్న యువతను చూసి పుడమితల్లి మురిసింది. పల్లె, పట్నం తేడా లేకుండా.... గ్రామం, నగరం భేదం లేకుండా..... చిన్నా, పెద్దా సంగతి మరచిపోయేలా... వసంత కేళీ.. రంగుల హోలీని ఘనంగా జరుపుకున్నారు.

holi celebrations in telangana
రంగులు ఎగిసే... యువత మురిసే

రంగులు ఎగిసే... యువత మురిసే...

హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర వాసులు రంగుల్లో మునిగి తేలారు. అక్కడకక్కడా కరోనా భయంతో కాస్త హడావుడి తగ్గినప్పటికీ వసంతకేళీ రంగులను పులుముకుని కాంతులను విరజిల్లింది. అధికారులు... ప్రజాప్రతినిధులు... చిన్నారులు... యువత అనే తేడా లేకుండా రంగుల పండుగను కన్నుల పండువగా జరుపుకున్నారు. రసాయనాలు లేని రంగులు కొందరు జల్లుకుంటే... పలు వర్ణాల రంగుల్లో యువత తడిసి ముద్దైంది.

మంత్రుల సందడి

సిద్దిపేటలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆర్థికమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.... పర్యావరణానికి హాని కలగకుండా పండుగ జరుపుకోవాలన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వేడుకల్లో పాల్గొన్నారు. సిద్ధార్థ నగర్​ చిన్నారులతో కలిసి రంగులు పూసుకుని రంగుల పండుగ జరుపుకున్నారు.

కలెక్టర్​ కార్యాలయాల్లో రంగుల పండుగ

జగిత్యాల కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో రంగుల కేళీ వేడుకలు జరిగాయి. రెవెన్యూ ఉద్యోగులతో కలిసి కలెక్టర్ రవి పండుగ జరుపుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించని రంగులే వాడాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా కలెక్టర్‌ శశాంక సిబ్బందితో హోలీ జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, ఖమ్మంలో చిన్నారులు రంగునీళ్లు చల్లుకుంటూ సరదాగా గడిపారు.

భాగ్యనగరంలో వసంతకేళీ

హైదరాబాద్ వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. నెక్లస్​రోడ్​లోని లవ్ హైదరాబాద్ వద్ద యువతి,యువకులు రంగులు చల్లుకుని హొలీ సంబరాలు జరుపుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం వేడుకలపై చూపిందని యువత అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాంతంలో హోలీ చాలా ప్రత్యేకం

ఖమ్మంజిల్లా లోక్యా తండాలో హోలీ పండుగను ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. హోలీ సందర్భంగా దండు వేడుకలు చేసుకుంటారు. ఇందులో భాగంగా గత పండుగ నుంచి ఇప్పటివరకు పుట్టిన పిల్లల ఇళ్లకు గ్రామస్థులంతా కోలాటం ఆడుకుంటూ వెళ్లి బిడ్డకు పేరుపెట్టి అన్నప్రాసన చేస్తారు. ఈ వేడుకకు ఈ ప్రాంతవాసులు ఎక్కడున్నా వస్తారు. ఈ కార్యక్రమం కోసం సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తారు.

రంగుల పండుగనాడు ఆ ఇళ్లలో విషాదం

హోలీతో రాష్ట్రమంత రంగుల మయమైతే.. కొన్ని కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో హోలీ అనంతరం చెరువులో స్నానానికి దిగిన బాలిక విగతజీవిగా మిగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పునుకులలో ఈతకు వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. వరంగల్​ గ్రామీణ జిల్లా సంగం మండలం కాపులకనపర్తిలో చెరువులో దిగిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. మరోవైపు మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో హోలీ ఆడిన 17 ఏళ్ల అజయ్.. వాగులో స్నానం చేసేందుకు దిగి చనిపోయాడు.

ఇదీ చూడండి:రాములోరి కల్యాణానికి ముహూర్తం ఖరారు

Last Updated : Mar 9, 2020, 11:54 PM IST

ABOUT THE AUTHOR

...view details