న్యూజిలాండ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా325 పరుగులకు ఆలౌటైంది. అయితే ఇక్కడ అందరు బ్యాటర్లు ఔటైంది ఒక్కరి బౌలింగ్లోనే. అతడే కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్. పేరు వింటే భారత్కు చెందిన వాడిలా అనిపిస్తున్నాడు కదూ. మీరు అనుకున్నది నిజమే. ఇతడు పుట్టింది ముంబయిలోనే. కానీ ఆ తర్వాత న్యూజిలాండ్ వెళ్లిన ఇతడి కుటుంబం అక్కడే స్థిరపడింది. ఇప్పుడదే ముంబయి మైదానంలో 10 వికెట్లు సాధించి రికార్డు నెలకొల్పాడు అజాజ్.
టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీయడమంటే మాటలు కాదు. ఈ ఘనత సాధించడంలో 99 శాతం బౌలర్ల కష్టముంటే ఎక్కడో ఒక్క శాతం మాత్రం అదృష్టముంటేనే ఇది కుదురుతుందనేది వాస్తవం. లేకుంటే 10 బ్యాటర్లను ఒక్కరే ఔట్ చేయడమేంటండి. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరే ఈ ఘనత సాధించారు. భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 74 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు. ఇంతకంటే ముందు 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ 53 పరుగులిచ్చి 10 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
1999లో దిల్లీ టెస్టులో పాకిస్థాన్పై అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు నేలకూల్చి.. రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అజాజ్ పటేలే స్పిన్ మాయాజాలంతో ఈ ఘనత.. మళ్లీ ఇన్నాళ్లకు నమోదైంది. దాదాపు 1000 టెస్టుల తర్వాత ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్ల రికార్డు నమోదైంది. 428వ టెస్టులో లేకర్ 10 వికెట్ల ఘనత సాధించగా.. 1443వ టెస్టులో కుంబ్లే ఈ రికార్డ్ నెలకొల్పాడు. 22 ఏళ్ల తర్వాత 2,438వ టెస్టులో అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్ల ఘనత సాధించాడు.