తెలంగాణ

telangana

ETV Bharat / sports

జడేజా, సైనీ పోరాటం వృథా.. సిరీస్​ కివీస్​ సొంతం

ఆక్లాండ్​ వేదికగా భారత్​తో రెండో వన్డేలో న్యూజిలాండ్​ ఘన విజయం సాధించింది. 274 పరుగుల లక్ష్య ఛేదనలో 251 రన్స్​కే టీమిండియాను పరిమితం చేసింది కివీస్​ జట్టు. ఫలితంగా ఈ మ్యాచ్​లో 22 పరుగుల తేడాతో గెలిచింది బ్లాక్​క్యాప్స్​ జట్టు. టీ20 సిరీస్​ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ సిరీస్​ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది.

By

Published : Feb 8, 2020, 3:35 PM IST

Updated : Feb 29, 2020, 3:37 PM IST

New Zealand vs India, 2nd ODI: New Zealand won by 22 runs at Eden Park, aukland
సైనీ, జడేజా పోరాటం వృథా.. కివీస్​ సిరీస్​ కైవసం

ఐదు టీ20ల సిరీస్​లో ఘోరంగా విఫలమైన న్యూజిలాండ్​... వన్డే సిరీస్​లో అనూహ్యంగా పుంజుకుంది. అదే 5 టీ20ల్లో ఘన విజయాలు సాధించిన భారత్​... డీలా పడింది. ప్రపంచకప్​ సెమీస్​ మ్యాచ్​ను గుర్తుచేస్తూ.. మరోసారి టీమిండియాకు ఓటమి రుచి చూపించింది. వన్డే సిరీస్​ కాపాడుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్​లో ఆల్​రౌండర్​ ప్రదర్శనతో 22 పరుగుల తేడాతో భారత్​ను ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలమై.. ఓటమిపాలైంది.

బౌల్డ్​.. బౌల్డ్​.. బౌల్డ్​..

నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే షాకిచ్చాడు బెనెట్​. 21 పరుగుల స్కోరు వద్ద మయాంక్​(3)ను పెవిలియన్​ చేర్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్​ పృథ్వీషా(24) జెమీసన్​ బౌలింగ్​లో క్లీన్​బౌల్డ్​ అయ్యాడు. కేవలం 13 పరుగుల వ్యవధిలో ఇద్దరు ఓపెనర్లు ఔటవడం వల్ల భారత్​ కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న 'కింగ్​ ఆఫ్​ చేజ్​' విరాట్​ కోహ్లీ 15 పరుగులకే వెనుదిరిగాడు. 53 పరుగుల వద్ద సౌథీ బౌలింగ్​లో క్లీన్​బౌల్డ్ అయ్యాడు.

శ్రేయస్​ పోరాడినా...

మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్​.. ఈ మ్యాచ్​లో నిరాశపర్చాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్రాండ్​హోమ్​ బౌలింగ్​లో బౌల్డ్​ అయి పెవిలియన్​ చేరాడు. కేదార్​(9) మరోసారి విఫలమయ్యాడు. మరో ఎండ్​లో ఉన్న శ్రేయస్​ ఒంటరి పోరాటం చేస్తూ కెరీర్​లో మరో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే బెనెట్​ వేసిన 27వ ఓవర్​లో ఔట్​ అయ్యాడు శ్రేయస్​(52).

ఒంటరి పోరాటం...

శ్రేయస్​ నిష్క్రమణ టీమిండియా ఔలౌట్​ అవడానికి ఎక్కువ సమయం పట్టదనుకున్నారు అంతా. కానీ జడేజా నిలకడగా ఆడుతూ స్కోరును నడిపించాడు. శార్దూల్​(18) కొన్ని షాట్లు ఆడినా .. ఎక్కువ సేపు క్రీజులో నిలపడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన సైనీ సిక్సర్లు, ఫోర్లతో 45 రన్స్​ చేసి ఔటయ్యాడు. సైనీ.. విరాట్​ కోహ్లీ కన్నా ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం. ఆఖరి వరకు క్రీజులో పోరాడిన జడేజా(55) కెరీర్​లో మరో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే విజయానికి చేరువలో నీషమ్​ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి ఔటయ్యాడు.

న్యూజిలాండ్​ బౌలర్లలో టిమ్​ సౌథీ , గ్రాండ్​హోమ్​, సోథీ, బెన్నెట్​, నీషమ్​ తలో వికెట్​ సాధించారు.

గప్తిల్​, టేలర్ అదుర్స్​​...

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్​ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. గప్తిల్​(79), టేలర్​(73*) అర్ధశతకాలతో రాణించారు. ఆఖర్లో ఎనిమిదో వికెట్​కు జెమీసన్​(25*)తో కలిసి టేలర్​ కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. భారత బౌలర్లలో చాహల్​ మూడు, శార్దూల్​ రెండు వికెట్లు తీశారు.

వన్డే సిరీస్​లో ఆఖరి మ్యాచ్​ ఫిబ్రవరి 11న మౌంట్​ మౌంగనుయ్​లోని బే ఓవల్​ వేదికగా జరనుంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే సిరీస్​ క్లీన్​స్వీప్​ కాకుండా కాపాడుకుంటుంది కోహ్లీసేన.

Last Updated : Feb 29, 2020, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details