లాక్డౌన్తో క్రికెట్ కార్యకలాపాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాంచీలోని తన ఫామ్హౌస్లో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఇతర ఆటగాళ్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హుషారుగా ఉంటుంటే.. ధోనీ మాత్రం వాటికి దూరంగా ఉంటున్నాడు. ధోనీ భార్య సాక్షి, అభిమానుల ఖాతా నుంచి మాత్రమే అతనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
తాజాగా ధోనీ ట్రాక్టర్తో పొలాన్ని దున్నుతున్న వీడియోను అభిమానులు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఇందులో మహీ సేంద్రీయ వ్యవసాయాన్ని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ధోనీ తన ఫేస్బుక్ ఖాతాలో వీడియో పోస్ట్ చేస్తూ.. పుచ్చకాయ, బొప్పాయి పండ్లను సేంద్రీయ పద్దతిలో ఎలా పండించాలో వెల్లడించాడు. ప్రస్తుతం లాక్డౌన్తో తీరిక సమయం దొరకడం వల్ల.. మహీ తన అభిరుచులవైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.